హైదరాబాద్:
రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం ఇంధన శాఖ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న మోడల్ సోలార్ రూఫ్ టాప్ విలేజ్ పనుల వివరాలను అధికారులు వివరించారు.
రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా ఇందిరా సోలార్ గిరి జల వికాసం ద్వారా సోలార్ పంప్ సెట్లను అందించాలని సీఎం సూచించారు. వ్యవసాయ పంపుసెట్లకు కంటైనర్ బేస్డ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. మహిళా రైతులకు ఇది విద్యుత్తో పాటు అదనపు ఆదాయ వనరులు కూడా అందిస్తుందని సీఎం పేర్కొన్నారు
అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన పాఠశాలలు, భవనాలపై అధికారులు సమాచారం అందించారు.
పునరుత్పాదక విద్యుత్ రంగంలో అధిక పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించి, బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

