ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఈ వాయుగుండం త్వరలోనే దక్షిణ ఆంధ్ర తీరానికి, ఉత్తర తమిళనాడు తీరానికి సమీపించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.ప్రస్తుతం వాయుగుండం మరింత బలపడితే తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. అదనంగా, ఈనెల 26న అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, అలాగే రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, వైయస్సార్ కడప, సత్యసాయి జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది.కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండగా, ఈనెల 23, 24 తేదీల్లో గాలివేగం 50 నుండి 70 కిలోమీటర్లకు పెరగవచ్చని హెచ్చరికలు జారీచేశారు.అదేవిధంగా, మత్స్యకారులు సముద్రానికి వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
previous post

