భోపాల్: పాఠశాలలో క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పిన ప్రిన్సిపల్ను ఓ విద్యార్థి దారుణంగా కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛతర్పుర్ జిల్లాలోని ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్కే సక్సేనా (55) ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పాఠశాలకు వచ్చిన ప్రిన్సిపల్ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బాత్రూమ్కు వెళ్లారు. అక్కడే కాపు కాసిన 12వ తరగతి విద్యార్థి ఆయన బయటకు రాగానే ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో సక్సేనా అక్కడికక్కడే మరణించారు. అనంతరం మరో విద్యార్థితో కలిసి ప్రిన్సిపల్ స్కూటర్పైనే అతడు అక్కడి నుంచి పరారైనట్లు విద్యార్థులు పేర్కొన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్పీ ప్రజాపతి ఈ ఘటనపై మాట్లాడుతూ.. సక్సేనా ఐదేళ్లుగా ఈ పాఠశాలలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయన వారిని మందలించినందుకే ఈ ఘోరానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దారుణానికి పాల్పడిన విద్యార్థులకు కఠిన శిక్ష విధించాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పరారీలో ఉన్న విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు.
previous post

