కేసీఆర్ ప్రసంగం చాలా బాగుంది’.. ఇది రజతోత్సవ సభ ముగిసిన వెంటనే ఏపీలోని కుప్పం నుంచి వెంకటేశ్వర్లు అనే మిత్రుడి నుంచి వచ్చిన మెసేజ్.’కేసీఆర్ వంటి నాయకుడు మాకుంటే బాగుండు’ అని ఆంధ్రా మిత్రులు అంటుంటారు. ‘అనతికాలంలోనే కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు సముదాయాన్ని కట్టడమైనా, యాదగిరి ఆలయాన్ని పునర్నిర్మించడమైనా, సచివాలయాన్ని గర్వకారణంగా తీర్చిదిద్దడమైనా అది కేసీఆర్కే సాధ్యం’ అని ప్రశంసిస్తుంటారు. ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఏదో రాజకీయం కోసం విమర్శలు చేయడం పక్కనపెడితే కేసీఆర్ రెండు పర్యాయాల పాలనలో అనేక అద్భుతాలు సృష్టించారని, రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని ఆయన ప్రత్యర్థులు కూడా వ్యక్తిగత సంభాషణల్లో అంగీకరిస్తారు. అందుకే కేసీఆర్ సభ లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందంటే చాలు, తెలంగాణలోనే కాదు, ఆంధ్రలో కూడా అనేకమంది ఆసక్తిగా టీవీలో చూస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడిపై లేని ఆసక్తి కేసీఆర్పై ఉంటుంది.ఎల్కతుర్తి సభ కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్లీ ఉద్యమకాలాన్ని గుర్తుచేసింది. ఈ సభ జరగడానికి ముందు రెండు వారాల పాటు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి నేను తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలలో తిరిగాను. ప్రతిచోటా కేసీఆర్ పట్ల జనం ఆశగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తమను తప్పుడు వాగ్దానాలతో ఘోరంగా మోసం చేసిందని ప్రజలు వాపోతున్నారు. హామీలు అమలుచేయకపోవడం ఒక్కటే కాదు, గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను నిలిపివేయడం వారిని ఆగ్రహానికి గురిచేస్తున్నది. ‘ఏం చేసిండ్రు, నిండా మోసం చేసిండ్రు. రుణమాఫీ కాకపాయె, రైతుబంధు కూడా ఇస్తలేరాయె’ అని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవుడ గ్రామానికి చెందిన రాజన్న అన్నడు. ‘నేను మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన. కానీ, ఇప్పుడు కేసీఆర్ సభకు జనం తరలిపోతుంటే, సహాయం చేస్తున్న’ అని ఒక గ్రామస్థుడు చెప్పిండు. మహబూబ్నగర్ కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామస్థుడు కురుమ మల్లన్న గొర్రెల కాపరి. గొల్ల కురుమలను తాత ముత్తాతల కాన్నుంచి ఎవడు పట్టించుకున్నడు. ఏ సర్కారు నుంచి ఏం అందలేదు. గొర్లిచ్చినా, చెర్ల చాపలు ఏసినా అది కేసీఆర్ చేసిందే. దేశంల ఎక్కడన్న గింత చేసిండ్రా’ అని చెప్తూనే ఉన్నడు. ‘కాంగ్రెస్ వచ్చినంక అన్ని బంద్ పెట్టె’ అని ఆయన అన్నడు. ఆందోల్ నియోజకవర్గం డాకూర్ గ్రామంలో భూమక్క ‘కల్యాణలక్ష్మి ఇస్తలేరు, తులం బంగారం ఎక్కడ. కేసీఆర్ సార్ ప్రతి ఒక్కటి పట్టించుకునేటోడు. మొదట్ల కల్యాణలక్ష్మి పెండ్లిపిల్లకు ఇద్దురు. దీంతో మొగడు పైసలు ఇయ్యాల్నని లొల్లి. అది తెలుసుకొని పేదోళ్లు ఆగం కావద్దని పైసలు పిల్ల తల్లి పేర మీద ఇచ్చుడు పెట్టిండు’ అని వివరంగా చెప్పింది. జనాన్ని కదిలిస్తే చాలు, ‘కేసీఆర్ పాలన ఎంతో మంచిగుండె’ అంటున్నరు. జనాన్ని కేసీఆర్ సభకు పోతరా అని అడిగితే పిల్లలైతే పోతమని అన్నరు. కొందరు మాత్రం ఎండలకు ఆరోగ్యం బాగాలేదు బిడ్డా, కని సభ మంచిగ జరగాలని కోరుకుంటున్నమని చెప్పిర్రు. ఒకాయనైతే సార్ సల్లంగుండాలె అని రెండు చేతులు జోడించిండు.హైదరాబాద్ బస్తీల నుంచి కూడా జనం ఎల్కతుర్తి సభకు భారీగా హాజరుకావడం గమనించవలసిన విషయం. గత ఎన్నికల్లో రాజధాని నగరం కేసీఆర్కు హారతి పట్టింది. ఇప్పటికీ ఇక్కడి ప్రజల్లో ఆ అభిమానం చెక్కు చెదరలేదు. బస్తీలలో జనాన్ని కదిలించి చూశాను. వారిలో తీవ్ర అసంతృప్తి, నైరాశ్యం కనిపిస్తున్నది. ఒక్కసారిగా నరకంలోకి జారిపడినట్టున్నదని ఒకింత విద్యావంతుడైన యువకుడు అన్నాడు. కేసీఆర్ పాలనలో ఒక్కనాడు కరెంటు కోత లేదు. కానీ, ఇప్పుడు కరెంటు లేదు. బస్తీ దవాఖానలు సరిగ్గా నడుస్తలేవని వారి బాధలు చెప్తున్నరు. కేసీఆర్ పాలనలో యువతలో ఎంటర్ప్రెన్యూర్షిప్ బాగా పెరిగింది. తెలంగాణ వచ్చింది, మన బతుకులు మారాయనుకున్నరు. కానీ, ఒక్కసారిగా పరిస్థితులు | మారడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నరు. రియల్ ఎస్టేట్ కుప్పకూలడాన్ని చాలామంది ఉదాహరణగా చెప్తున్నారు. కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కూడా ఆగిపోయాయి కానీ, ఇప్పుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారులూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఒక బస్తీలో పెద్దమనిషి అన్నడు. హైదరాబాద్ బస్తీల్లో, జిల్లాల్లోని గ్రామాల్లో తిరిగినప్పుడు జనం కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగి, బహిరంగ సభ పెట్టడం పట్ల సంతోషంగా ఉన్నరని తెలిసిసోయింది.నేను ఊహించినట్టుగానే, కేసీఆర్ సభకు ఎక్కువగా 20 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సు వారు వచ్చారు. ఇందులో కొందరు యువప్రాయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు. కాగా, అనేకమంది కౌమార దశ నుంచి కేసీఆర్ పాలన చూసినవారు. కేసీఆర్ పాలన వల్ల లబ్ధి పొందిన పేద కుటుంబాల నుంచి వచ్చినవారు. కేసీఆర్ నీళ్లిచ్చిండు, చెరువులు నింపిండు. వీళ్లకు నల్ల నీళ్ళు ఇయ్యడం కూడా చాతనైతలేదని ఒక పేద యువకుడు ఆగ్రహంగా అన్నడు. అందుకనే కేసీఆర్ ప్రసంగం మొదలుపెట్టగానే ‘సీఎం సీఎం’ అనే నినాదాలు మిన్నుముట్టాయి. కేసీఆర్ మాటలకు ఊర్రూతలూగిందీ యువకులే. తెలంగాణ జెండా పట్టుకోవడానికి ఇప్పుడు యువకులే ముందుకొస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం.కేసీఆర్ ప్రసంగం ప్రజలకు హత్తుకున్నది. తెలంగాణ తన కండ్ల ముందే తెర్లయిపోవడాన్ని చూసి కేసీఆర్ బాధపడటం ప్రజలకు కూడా ఆవేదన కలిగించింది. ఇంకో మూడేండ్లు భరిద్దామని, తర్వాత మనదే అధికారమని కేసీఆర్ చెప్పడంతో ప్రజలకు ఊరట లభించింది. ఆవేదనతో ఉన్న జనానికి కేసీఆర్ మాటలు ధైర్యాన్నిచ్చాయి. ఆ ధైర్యాన్నివ్వడమే నాయకుడి లక్షణం.

previous post