Tv424x7
National

రైతు రాజీనామా…!!

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో తన కష్టానికి తానే వెలకట్టుకునే (పంటలకు ధరలు) స్వతంత్రం రాని ఒకే ఒక వ్యక్తి రైతు. ఆదాయ భద్రత లేని ఏకైక రంగం వ్యవసాయం.వ్యవసాయదారుడు అంటేనే సమాజంలో ఒక చిన్న చూపు. ఆదాయం మాట పక్కనబెడితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక, అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను చూసి నేటి యువతరం వ్యవసాయం చేయడానికి ముందుకురావడం లేదు. ఇప్పటికే సాగు చేస్తున్న యువతరం వ్యవసాయాన్ని వదిలి వేరే ఉపాధి మార్గాన్ని వెతుక్కుంటున్నది.ఇప్పటికే వ్యవసాయానికి అత్యంత ప్రధానమైన నాగలి, ఎడ్లు, గొర్రు, కొడవలి లాంటివి ఇప్పటి తరానికి తెలవకుండా పోయింది!

భవిష్యత్తులో ఆ పరికరాలను, రైతులను మ్యూజియంలో చూసే పరిస్థితి వచ్చేటట్టు ఉంది. భారత వ్యవసాయం సంక్షోభంలో లేదు, రైతు మాత్రమే సంక్షోభంలో ఉన్నాడు. మన దేశంలో ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రతిరోజు సుమారు 2-3 వేల మంది రైతులు వ్యవసాయరంగాన్ని వదిలి ఇతర రంగాలకు వెళ్లిపోతున్నారు. ఇంకా 40 శాతం మంది రైతులు తమకు ఇష్టం లేకున్నా, నష్టాలను మూటగట్టుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, సొంతూరిని వదిలిపెట్టి బయటికిపోలేక సాగు చేస్తున్నారు.ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం.. మన దేశంలో 1995-2022 వరకు 3,97,540 మంది రైతులు, తెలంగాణలో 33,325 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి అధికారిక గణాంకాలు. 2023- 2024 సంవత్సరాల గణాంకాలను ఎన్సీఆర్బీ ఇంకా విడుదల చేయలేదు. ఈ ఆత్మహత్యల గణాంకాల్లో కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు లెక్కలోకి రారు. ప్రభుత్వ లెక్కలకు అందని రైతుల ఆత్మహత్యలు ఇంకా ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి.దేశ జనాభాకు సరిపోయే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న వ్యవసాయ రంగం బాగానే ఉంది. కానీ, ఆ ఉత్పత్తికి మూల కారణమైన వ్యవసాయదారుడు మాత్రం రోజురోజుకు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాడు. అందుకే దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల పరంపరను మనం నిత్యం చూస్తున్నాం. భూమి అనేది ఆకలి తీర్చే కన్న తల్లి లాంటిది. ఆ భూమి భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపద! కానీ, ఇప్పుడు తెలంగాణలో భూములు రైతుల చేతుల్లో నుంచి ఇటు ఆ గ్రామస్థులు కాని, అటు రైతులు కాని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పట్టాదారు పాస్‌బుక్‌ ఉంటేనే రైతు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఒకప్పుడు భూమి అంటే పంటలు పండించే ఒక ప్రధాన సాధనం, ఒక బతుకుదెరువు, ఒక కుటుంబానికి వారసత్వ సంపద, ఒక భరోసా! ఆ గ్రామస్థుల ఆస్తి కాని భూమి అంటే పంటలు పండించే సాధనం కాదన్నట్టే. భూమి అంటే సామాజిక హోదాకు ప్రతిరూపం. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న రైతు బీమా, రైతు బంధు/రైతు భరోసా, పన్నుల మినహాయింపు లాంటి పథకాలను ఉపయోగించుకోవడాకి ఐదు గుంటల నుంచి వందల ఎకరాల వరకు చాలామంది ఉద్యోగులు, వ్యాపారులు భూములను కొనుగోలు చేస్తున్నారు. ‘మాకు భూమి ఉంది’ అని చెప్పుకొని గర్వపడుతున్నారు.ఇవాళ తెలంగాణలో రైతుల చేతుల్లో భూమి లేదు. భూమి పట్టా ఉన్నవారు రైతులు కారు. తెలంగాణలో భూమి పట్టాదారుల సంఖ్య 2018-19లో 50,23,861ఉండగా.. 2024-25లో 70,60,000కు చేరింది. పట్టాదారులు పెరుగుతున్నారు కానీ, రైతులు తగ్గుతున్నారు. భూమి ఉంటుంది కానీ, ఆ కుటుంబం వ్యవసాయం చేయదు. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం తునికి ఖల్సా గ్రామంలో ఆ గ్రామస్థులకు 1,133 ఎకరాలుంటే ఇతరులకు 1,203 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఇదొక ఉదాహరణ మాత్రమే. వ్యవసాయం చేసే యువకులకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకురావడం లేదంటే అతిశయోక్తి కాదు. నేటి యువతరం సెక్యూరిటీ గార్డుగానైనా పని చేయడానికి సిద్ధపడుతున్నారు కానీ, వ్యవసాయం చేయడానికి ఇష్టపడటం లేదు.రైతు రాజీనామా చేస్తే భారతదేశానికి భవిష్యత్తు లేదు. భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడే ప్రమాదమున్నది. కాబట్టి రైతును గౌరవిద్దాం! అన్నదాతను కాపాడుకుందాం!! రైతు ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మించుకుందాం.

యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించేందుకు పలు సూచనలు మనం అన్నదాతలను గౌరవించాలి.రైతుకు బతుకుపై భరోసా కల్పించాలి.పెట్టిన పెట్టుబడులు తిరిగి రాబట్టుకునే పరిస్థితులు ఉండాలి.పండిన పంటలకు లాభసాటి ధరలు కల్పించాలి. రైతులకే ధరల నిర్ణయాధికారం ఇవ్వాలి.రుణ సౌకర్యం కల్పించాలి.రైతు బీమాతో పాటు పంట బీమా కూడా అమలు చేయాలి.రైతుల పిల్లలకు రిజర్వేషన్‌ సౌకర్యాలు కల్పించాలి.అభివృద్ధి పేరిట రైతుల నుంచి బలవంతంగా పంట పొలాలను తీసుకోకూడదు.ఆత్మహత్యలను నివారించాలి. బలవన్మరణాలకు పాల్పడితే ఆ కుటుంబం ఎట్లా నష్టపోతుందో అవగాహన కల్పించాలి.రైతులు పంట ఉత్పత్తులు విక్రయించేందుకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి.నకిలీ విత్తనాలను అరికట్టాలి.ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజమైన రైతులకు అందించాలి.వ్యవసాయ భూములు కచ్చితంగా వ్యవసాయదారులే కొనుగోలు చేసేలా చట్టాలు తీసుకురావాలి.వ్యవసాయ రంగంపై పార్లమెంట్‌, అసెంబ్లీలు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలి.

Related posts

బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష

TV4-24X7 News

వినేశ్ ఫోగట్ అప్పీల్.. తీర్పు మరోసారి వాయిదా

TV4-24X7 News

కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే

TV4-24X7 News

Leave a Comment