మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 5.2 కిలోల బరువుతో ఓ మగ శిశువు జన్మించి వైద్యులను ఆశ్చర్యానికి గురి చేశాడు. సాధారణంగా పుట్టే శిశువుల బరువు 2.8 నుండి 3.2 కిలోల వరకు మాత్రమే ఉంటుందని వైద్యులు చెబుతారు. అయితే, ఈ బిడ్డ బరువు దాదాపు రెండింతలు కావడంతో అందరూ విస్మయానికి గురయ్యారు.
శుభాంగి అనే మహిళ సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
వైద్య నిపుణులు మాట్లాడుతూ, “అరుదైన ఈ సంఘటన ఆనందదాయకం. ఇంత బరువైన శిశువు సురక్షితంగా పుట్టడం చాలా సంతోషకరం” అని పేర్కొన్నారు.