నాలుగేళ్లుగా నరకయాతన.. మంచానికే పరిమితమైన మధుబాబు
వైద్యం కోసం దాతల సాయం కోసం ఎదురుచూపు
కమలాపురం: ఒక్క రోడ్డు ప్రమాదం ఓ కుటుంబం జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రమాదం జరిగి నాలుగేళ్లు గడిచినా.. మధుబాబు కుటుంబం కష్టాలు మాత్రం తీరలేదు. వైద్యం చేయించుకోవాలనే ఆశ ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ప్రస్తుతం మంచానికే పరిమితమైన మధుబాబు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు.కడప జిల్లా కమలాపురం మండలం టి.చదిపిరాళ్ల గ్రామానికి చెందిన బెల్లం జయన్న కుమారుడు బెల్లం మధుబాబు నాలుగేళ్ల క్రితం కడప బైపాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తన ద్విచక్ర వాహనానికి పెట్రోల్ పట్టించుకుని రోడ్డు దాటుతున్న సమయంలో అటువైపు నుంచి వచ్చిన ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో మధుబాబు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక కాలికి శస్త్రచికిత్స చేసి రాడ్లు అమర్చారు. మరో కాలికి కూడా ఆపరేషన్ చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో సకాలంలో వైద్యం అందించలేకపోయారు.సరైన సమయంలో పూర్తిస్థాయి చికిత్స అందకపోవడంతో కాలికి తీవ్ర సమస్య ఏర్పడింది. అనంతరం చికిత్స చేయించినప్పటికీ ఆశించిన ఫలితం రాకపోవడంతో ప్రస్తుతం రెండు కాళ్లు పనిచేయక మధుబాబు మంచానికే పరిమితమయ్యాడు.
పిల్లల చదువులు సైతం నిలిచిపోయాయి
నాలుగేళ్లుగా వైద్యం, కుటుంబ పోషణ, రోజువారీ అవసరాల కోసం ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పరిస్థితులు మరింత దయనీయంగా మారడంతో రెండేళ్లుగా పిల్లల చదువులు కూడా నిలిచిపోయాయి.ఒకవైపు తండ్రి వైద్యం కోసం కుటుంబ సభ్యుల ఆరాటం.. మరోవైపు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన.. ఇలా ఈ కుటుంబానికి ప్రతి రోజు ఒక పోరాటంగా మారింది.
దాతల సాయం కోసం వేడుకోలు
ప్రస్తుతం మధుబాబు మెరుగైన వైద్యం కోసం దాతల సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. మానవతా దృక్పథంతో దాతలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మంచి మనసున్న ప్రతి ఒక్కరూ స్పందించి తమకు తోచిన ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.నాలుగేళ్లుగా బాధను భరిస్తున్న ఈ కుటుంబానికి మనం అందించే చిన్న చేయూత.. వారి జీవితంలో కొత్త ఆశను నింపగలదు.సహాయం చేయదలచిన వారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్:📞 88 8653 82 84
Save or share this story as a newspaper-style Epaper Clip: