వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతియుత వాతావరణం ఉండాలి
– ఓబులవారిపల్లి ఎస్సై కె. సుజన్ కుమార్
ఓబులవారిపల్లి, సెప్టెంబర్ 11:
వినాయక చవితి ఉత్సవాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళంపల్లె హరిజనవాడలో శుక్రవారం రాత్రి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ, రైల్వేకోడూరు రూరల్ సీఐ శ్రీ డి. శ్రీనివాసులు సూచనల మేరకు ఓబులవారిపల్లి ఎస్సై కె.సుజన్ కుమార్ సిబ్బందితో కలిసి గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. వినాయక ఉత్సవాల కమిటీ సభ్యులు సమన్వయంతో వ్యవహరించాలని, ఎలాంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా వేడుకలు నిర్వహించాలని కోరారు.గణేష్ మండపాల వద్ద మద్యం సేవించి ఘర్షణలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు. నిమజ్జన కార్యక్రమాల సమయంలో చెరువులు, ఇతర నీటి వనరుల వద్ద కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డీజేలు, పెద్ద శబ్దాలతో కూడిన సౌండ్ బాక్సులు వినియోగించకూడదని, అసభ్యకర నృత్యాలకు తావు లేకుండా ఉత్సవాలను నిర్వహించాలని తెలిపారు.గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్సై స్పష్టం చేశారు. సమస్యాత్మక వ్యక్తులు, ట్రబుల్ మంగర్స్పై ముందస్తు చర్యల్లో భాగంగా బైండోవర్ చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాలో అమలులో ఉన్న 30 పోలీస్ యాక్ట్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ, హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: