విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలి
బకాయిదారులపై చర్యలు తప్పవు: మైదుకూరు ఈఈ డి. లక్ష్మీపతి
మైదుకూరు, సెప్టెంబర్ 12: మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మైదుకూరు, దువ్వూరు, చాపాడు, వనిపెంట, ఖాజీపేట సెక్షన్ల పరిధిలో విద్యుత్ వినియోగదారులు తమ సర్వీసులకు సంబంధించిన విద్యుత్ ఛార్జీలు, బకాయిలను సకాలంలో చెల్లించాలని మైదుకూరు విద్యుత్ శాఖ ఈఈ డి. లక్ష్మీపతి సూచించారు.
ఏదైనా విద్యుత్ సర్వీసుపై బకాయి ఉన్నట్లు గుర్తిస్తే, బకాయిల వసూళ్ల విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెల జారీ చేసే విద్యుత్ బిల్లులో చెల్లింపు గడువు తేదీ స్పష్టంగా ఉంటుందని, గడువులోగా బిల్లు చెల్లించని సర్వీసులకు సరఫరా నిలిపివేయవచ్చని తెలిపారు.
విద్యుత్ సరఫరా నిలిపివేసిన అనంతరం సిబ్బంది, అధికారులతో వాగ్వాదానికి దిగడం, విధులకు ఆటంకం కలిగించడం సరికాదని హెచ్చరించారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్పై అవగాహన అవసరం
SC, ST వినియోగదారులకు ప్రభుత్వం కల్పిస్తున్న నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఈఈ సూచించారు. నెలలో 200 యూనిట్లకు మించి ఒక్క యూనిట్ అధికంగా వినియోగించినా, నిబంధనల ప్రకారం సంబంధిత వినియోగదారు విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
ఉచిత విద్యుత్ పరిమితికి మించి వినియోగించిన సందర్భంలో బిల్లులు చెల్లించాలని సిబ్బంది సూచిస్తే వారిపై దాడులకు పాల్పడటం లేదా వాగ్వాదాలకు దిగడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
నగదు చెల్లింపులకు స్వస్తి
ఇకపై విద్యుత్ బిల్లుల చెల్లింపులను డిజిటల్ పేమెంట్ విధానంలోనే నిర్వహించాలని, నగదు రూపంలో బిల్లుల స్వీకరణను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఈఈ డి. లక్ష్మీపతి తెలిపారు.
విద్యుత్ వినియోగదారులు బిల్లులను గడువులోగా చెల్లించి, విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: