రాత్రికి రాత్రే డీలిమిటేషన్ చేయలేం: కేంద్రం
తీర్పు రిజర్వ్చేసిన ధర్మాసనం
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) రాత్రికి రాత్రే చేపట్టలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.ఇందుకోసం 2026 జనాభా లెక్కల సేకరణ వరకు వేచి చూడాల్సిందేనని తెలిపింది. ఇది చిన్న విషయం కాదని, పెద్దఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014లోని సెక్షన్ 26 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి 2022 జూన్7న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్తగా ఏర్పడిన ఈ రెండు రాష్ట్రాలను మినహాయించి… కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీరు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను మాత్రమే పునర్విభజించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సమాధానం చెప్పాలని ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ వ్యాజ్యం బుధవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.పిటిషనర్ తరఫున న్యాయవాది రావు రంజిత్ వాదనలు వినిపించారు, డీలిమిటేషన్ కమిషన్ నోటిఫికేషన్లలో రాష్ట్రాలను చేర్చడం, మినహాయించడం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యతని ఎన్నికల సంఘం తన అఫిడవిట్లో పేర్కొందని గుర్తు చేశారు. ఈ విషయంలో ఇప్పటికీ కేంద్రం తన సమాధానం చెప్పలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తరపు అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ స్పందిస్తూ.. డీలిమిటేషన్ ప్రక్రియ కోసం 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పిటిషనర్ పదేపదే ప్రస్తావిస్తున్న జమ్మూకశ్మీరు కేంద్రపాలిత ప్రాంతమని గుర్తు చేశారు. కేంద్రపాలిత ప్రాంతం కాబట్టే అక్కడ డీలిమిటేషన్ సాధ్యమైందని.. దానితో ఏపీ, తెలంగాణకు సంబంధం లేదన్నారు. ఈ వాదనపై రావు రంజిత్ అభ్యంతరం తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీరు హోదా మారిందని తెలిపారు. ఆయన వాదనలపై జస్టిస్ సూర్యకాంత్ అసహనం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీరు గురించి ప్రస్తావించవద్దని సూచించారు. రంజిత్ తన వాదనలు కొనసాగిస్తూ.. డీలిమిటేషన్ విషయంలో ఉత్తరాది, దక్షిణాది మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. కేంద్రం చెబుతున్నట్లు 2026 తర్వాత కూడా దక్షిణాదిన ఈ ప్రక్రియ చేపట్టే పరిస్థితి కనిపించడంలేదని తెలిపారు. జమ్మూకశ్మీరు కంటే ఐదేళ్ల ముందు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను డీలిమిటేషన్ అంశంలో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు.తొలుత.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డీలిమిటేషన్ నోటిఫికేషన్లో జమ్మూకశ్మీరు మాత్రమే గాక ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ కూడా ఉన్నాయని, ఆ జాబితాలోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు లేవని.. ఆ తర్వాత ఆ నోటిఫికేషన్ను కేంద్రం వెనక్కి తీసుకుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డీలిమిటేషన్ చేయాలన్న ఉద్దేశం కేంద్రానికిలేదని అర్థమవుతోందన్నారు. డీలిమిటేషన్ చట్టం ప్రకారం కేంద్రం తన అధికారాలను వినియోగించుకోవాలనుకుంటే.. అన్ని రాష్ట్రాలకూ అది ఒకేలా వర్తిస్తుందని.. అందులో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అనే తేడా ఎందుకని ప్రశ్నించారు. వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
విభజన చట్టంలో సీట్ల సంఖ్య పెంచుకునే వెసులుబాటు...ఏపీ విభజన చట్టం-2014ప్రకారం.. రాజ్యాంగంలోని అధికరణ 170లోని నిబంధనలకు లోబడి చట్టంలోని సెక్షన్ 15కు భంగం కలుగకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచుకునే వెసులుబాటు ఉంది. తెలంగాణలో 119నుంచి 175కు, ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225కు అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచనున్నట్లు పేర్కొన్నారు. 2022 జూలై 27న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సమాధానమిస్తూ.. ‘ఏపీ విభజన చట్టం సెక్షన్ 26కి అనుగుణంగా ఆర్టికల్170ని సవరించే వరకు సీట్లు పెంచలేం’అని స్పష్టంచేసింది.