ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై పక్కాగా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకే కాకుండా లోక్సభ ఎన్నికల కోసం ఆయా పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఇటీవలే కాంగ్రెస్లో చేరిన షర్మిల తాను పోటీ చేసే స్థానంపై తర్జన భర్జన పడుతున్నారు. అసెంబ్లీకి వెళ్లాలా.. లేక పార్లమెంటుకు వెళ్లాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఆమె సన్నిహితుల సమాచారం మేరకు వైఎస్ షర్మిల కడప పార్లమెంటు సెగ్మెంట్ నుంచి బరిలో ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీగా వైసీపీ నుంచి అవినాష్రెడ్డి మరో సారి పోటీకి సిద్ధంగా ఉన్నారు. బలాబలాల పరంగా ఆ పార్లమెంటు పరిధిలో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో కాంగ్రెస్ అక్కడ బలమైన ప్రత్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ఆర్ వారుసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన షర్మిలను కడప నుంచి బరిలోకి దింపితే అవినాష్ రెడ్డికి ధీటుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో అసలు షర్మిల ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు, ఎన్నికలు దగ్గర పడిన వేళ ప్రజల్లోకి వెళ్తారా.. అన్నది ఉత్కంఠ గా మారింది. ఇప్పటికే తన తండ్రి హత్యపై ఉన్న అనుమానాలతో అవినాష్ రెడ్డిపై కోపంతో రగిలిపోతున్న వివేకానంద రెడ్డి కూతురు సునీత కూడా కాంగ్రెస్ నేతలతో షర్మిలను కడప నుంచే పోటీలో ఉంచాలని అని విశ్వసనీయ సమచారం. తాజా పరిణామాల నేపథ్యంలో షర్మిల కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని, అందుకు అనుగుణంగా కడప నేతలతో మంతనాలు కొనసాగిస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా.. కడప ఎంపీ బరిలో ఎవరెవరో నిలుస్తారో.. నిలిచి ఎవరు గెలుస్తారో మరికొన్ని నెలలు ఆగాల్సిందే

previous post