సిద్దిపేట: తెలంగాణ ప్రజల ఆశలన్నీ భారాస ఎంపీలపైనే ఉన్నాయని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో భారాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది..పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు, కేటీఆర్, హరీశ్రావు కూడా సమావేశంలో పాల్గొన్నారు..కేసీఆర్ మాట్లాడుతూ.. ”అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది భారాస మాత్రమే. పార్లమెంట్లో భారాస గళం బలంగా వినిపించాలి. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలి. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలి. కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం. ఆపరేషన్ మ్యానువల్, ప్రొటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారు. భారాస క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఎవరితో సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదాం. త్వరలోనే నేను ప్రజల్లోకి వస్తా” అని తెలిపారు. ఉభయసభల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వైఖరి, వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు..

previous post
next post