కమలాపురం, జూలై 28: కమలాపురం మూడు రోడ్ల కూడలి వద్ద తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమలాపురం నుంచి కడపకు విద్య, ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాలు తదితర అవసరాల కోసం ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణిస్తున్నారు.అయితే బస్సుల కొరత కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, కూలీలు గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సులు వచ్చిన వెంటనే అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కేందుకు ప్రయత్నించడంతో కొంతమంది ఫుట్బోర్డులపై నిలబడి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.అంతేకాకుండా, ప్రయాణికులు పూర్తిగా బస్సు ఎక్కకముందే కొందరు డ్రైవర్లు బస్సులను కదిలించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు, బస్సులు రాగానే ఆటోరిక్షాలు ఈగలు చుట్టుకున్నట్లు బస్సులను చుట్టుముట్టడంతో ప్రయాణికులు ఎక్కడం, దిగడం మరింత ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాబట్టి కమలాపురం–కడప మార్గంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు, మూడు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి ఆటోల రద్దీని నియంత్రించాలని ఆర్టీసీ అధికారులు, సంబంధిత శాఖలను ప్రయాణికులు కోరుతున్నారు.
కమలాపురం మూడు రోడ్ల కూడలిలో ప్రయాణికుల అవస్థలు.. అదనపు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
28
Jul