పాలిటెక్నిక్ కళాశాల సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కలెక్టర్తో కలిసి పరిశీలన, మౌలిక వసతుల కల్పనకు ఆదేశాలు..
మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, మౌలిక వసతుల కొరతపై స్పందించిన మైదుకూరు శాసనసభ్యులు
పుట్టా సుధాకర్ యాదవ్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.
తనిఖీ సందర్భంగా కళాశాల భవనాల దయనీయ పరిస్థితి, తరగతి గదులు, ప్రయోగశాలలు, ప్రాథమిక సౌకర్యాల కొరతను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే గారు విద్యార్థులు ఇలాంటి పరిస్థితుల్లో విద్యాభ్యాసం కొనసాగించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఐఏఎస్ గారిని వెంటనే కళాశాలకు ఆహ్వానించి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించేలా చర్యలు తీసుకున్నారు. కళాశాలలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గారు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అత్యవసరంగా అవసరమైన మౌలిక వసతులు, భవనాల మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర అన్ని సౌకర్యాలను తక్షణమే కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు కళాశాలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను అత్యవసర ప్రాతిపదికన మంజూరు చేయడంతో పాటు, నూతన కళాశాల భవనం నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కూడా త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, ఆధునిక విద్యా వాతావరణాన్ని కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు తెలిపారు. విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మైదుకూరు నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ విద్యాసంస్థను దశలవారీగా బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: