దువ్వూరు, జూలై 30: పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కడప జిల్లా ఎస్పీ షెల్కే నవికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు దువ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు.
దువ్వూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ధనుంజయుడు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణతో పాటు మండల కేంద్రంలోని కోదండరామస్వామి ఆలయం, శివాలయం, రామ్ సాయి నగర్ సాయిబాబా దేవాలయ ఆవరణల్లో జామ, నేరేడు, దానిమ్మ, ఉసిరి తదితర పండ్ల మొక్కలను నాటారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ధనుంజయుడు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి వృక్షాలుగా పెంచినప్పుడే హరితాభివృద్ధి లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పోలీస్ స్టేషన్ పరిధిని మరింత పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.