కడప /మైదుకురు :ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (AIKS) మైదుకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మైదుకూరు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ (AO) లక్ష్మీ ప్రసన్న గారికి రైతాంగ సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేయడం జరిగింది.నూతన ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సాగు సాయం 20వేల రూపాయలను వెంటనే రైతన్న ఖాతాల్లో జమ చేయవలెనని, తెలంగాణ ప్రభుత్వం సాగు సహాయం కింద ఎకరానికి 15 వేల రూపాయలు అందజేస్తున్నదని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎకరానికి 15000 రూపాయలు సాగు సాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని. ఖరీఫ్ ప్రారంభమైనందున కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైనవిత్తనాలు,ఎరువులు,పురుగుమందులు రైతులకు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయవలెనని, ఎం ఆర్ పి ధరలకే అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని. రైతులకు మూడు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందించాలని, ఐదు లక్షల వరకు పావలా వడ్డీకే రుణాలు అందజేయాలి.
50 శాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేయాలి మెట్ట రైతులకు పది ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్పును అందజేయాలి
90 శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలను అదేవిధంగా విత్తనం వడ్లను రైతులకు అందజేయాలి
2014- 2019 మధ్యకాలంలో అప్పుడు నాటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీ వాగ్దానం పూర్తి కాకపోవడం వలన లక్షలాది మంది రైతులు లక్షలాది రూపాయలు వడ్డీల రూపంలో బ్యాంకులకు బకాయి పడ్డారని ఇప్పుడైనా నాటి బకాయిలపై చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వైయస్సార్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి భాస్కర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం అన్న రైతుల అన్న చులకనాని గత 14 సంవత్సరాల పాలనను గమనిస్తే అర్థమవుతుందని ఆ చెడ్డ పేరును చెరిపేసుకోవాలంటే వ్యవసాయానికి పెద్దపీట వేయవలెనని చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చవలెనని ప్రాజెక్టుల నిర్మాణానికి అదేవిధంగా పంట కాలువల నిర్మాణానికి, నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పించడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని లేనిపక్షంలో ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం మరియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిలుంగారి పెద్ద పుల్లయ్య, జిల్లా సమితి సభ్యులు గోశెట్టి రామ్మూర్తి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మైదుకూరు నియోజకవర్గ మరియు మైదుకూరు మండల కమిటీ నాయకులు ఎన్ సుబ్బారెడ్డి, కత్తి నాగిరెడ్డి, కొమ్మినేని చెన్నయ్య, కొట్టే రామ్మోహన్, కొమ్మినేని లక్ష్మయ్య , ధనపాల నారపు శెట్టి తదితరులు పాల్గొన్నారు