కడప: సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హోం మంత్రి అనిత తదితరులపై అసభ్యకర పోస్టుల కేసులో నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు కర్నూల్ రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు.. ఆదివారం మార్కాపురం సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అసభ్యకర పోస్టుల కేసులో అరెస్టయిన వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్రెడ్డితోపాటు మరో ఇద్దరు నిందితులు సుబ్బారెడ్డి, ఉదయ్లను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలను కోయా ప్రవీణ్, కడప ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు వివరించారు.”నిందితులు వాడిన భాష అసభ్యకరంగా ఉంది. అరబ్ దేశాల్లో అయితే తీవ్ర శిక్షలు ఉంటాయి. సీఎం, డిప్యూడీ సీఎం కుటుంబాలపై తీవ్రమైన దూషణలు వాడారు. వర్రా రవీందర్రెడ్డి గతంలో భారతి సిమెంట్స్లో పని చేశాడు. మరో ఇద్దరు కూడా వైకాపా సోషల్ మీడియాలో పని చేస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులను వైకాపాకి అనుకూలంగా వినియోగించుకున్నారని నిందితులు తమ వాంగ్మూలంలో చెప్పారు. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టారు. మహిళా కుటుంబసభ్యులు, వారి పిల్లలపై పోస్టులు పెట్టారు. ఇలాంటి వారిని 45 మందిని గుర్తించాం. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం.నాయకుల ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టేవారు. నిందితులకు 40 యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నట్లు గుర్తించాం. వాటి ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయం నుంచి వీటిని నడిపేవారు. జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో వీరంతా పని చేసేవారు. తాడేపల్లిలోని పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే పోస్టులు పెట్టేవారు. అధికారంలో ఉన్న మహిళా నేతలనే టార్గెట్ చేసుకొని పోస్టులు పెట్టారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది. వారు పెట్టిన పోస్టులను సాధారణంగా చదవలేం. సభ్య సమాజం అసహ్యించుకునేలా వారి పోస్టులు ఉన్నాయి. మహిళలపై ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని రాక్షసజాతికి చెందినవారిగా భావిస్తున్నాం” అని ప్రవీణ్ వివరించారు.

next post