ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై అధిష్టానంతో చర్చించాల్సి ఉంది.ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా.. కలిసే వెళ్లేవారు. ఎవరిని కలవాలన్నాఒకే కారులో వెళ్లివచ్చేవారు. హైదరాబాద్కు కూడా ఆ ఇద్దరు కలిసే వచ్చేవాళ్లు. కానీ అప్పుడు అలా జరగలేదు. ఒకరు ముందు ఢిల్లీకి వెళ్లి వచ్చాక.. మరొకరు పయనమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి ఢిల్లీకి వెళ్లే సంప్రదాయానికి ఎందుకు బ్రేక్ పడింది. ముఖ్యమంత్రి కంటే ముందు భట్టి ఢిల్లీకి ఎందుకు వెళ్లివచ్చినట్టు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఏం జరగబోతోంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడివిడిగా ఢిల్లీకి వెళ్లడంతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను రేపింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రేవంత్, భట్టి పదుల సంఖ్యలో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఒకే విమానం ఎక్కేవారు. అక్కడ ఒకే కారులో నేతల ఇళ్లకు, ఆఫీసులకు వెళ్లేవారు. ఏఐసీసీ పెద్దలు సోనియా గాంధీ, రాహూల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ.. ఇలా ఎవరిని కలవాలన్నా రేవంత్, భట్టి కలిసే వెళ్లేవారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సైతం రేవంత్, భట్టి జంటగానే వెళ్లి కలిశారు. ఇక కేంద్ర మంత్రులను కలిసిన చాలా సందర్బాల్లోనూ ఇదే సంప్రదాయం కొనసాగింది.కానీ ఇప్పుడు ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది. ఈసారి సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లకముందే.. భట్టి విక్రమార్క వెళ్లి వచ్చారు. ఢిల్లీలో రాహూల్ గాంధీతో సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిణామాలను వివరించడంతో పాటు మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనట్లు సమాచారం. ఇటు బంధువుల పెళ్లికి రాజస్థాన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. అటు నుంచి ఢిల్లీకి వచ్చే సరికి భట్టి విక్రమార్క ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్ వచ్చేశారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.అసలే కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకుంది. విజయోత్సవాలను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. వాటి వివరాలతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కులగణన వంటి ముఖ్యమైన అంశాల్ని అధిష్టానం పెద్దలకు వివరించాల్సి ఉంది. ఇలాంటి కీలక టైమ్లో రేవంత్, భట్టి విడివిడిగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్నదానిపైనే చర్చ జరుగుతోంది.మరీ ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై అధిష్టానంతో చర్చించాల్సి ఉంది. అయితే రేవంత్ రెడ్డి కంటే ముందే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్కరే రాహూల్ గాంధీని కలిసి ఈ అంశాలపై చర్చించడం అసక్తికరంగా మారింది. అందులోను సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ మొదలయ్యే సమయానికి భట్టి విక్రమార్క హైదరాబాద్ వచ్చేశారు.దీంతో అధిష్టానం పెద్దలతో చర్చించాల్సిన మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఏకాభిప్రాయం కుదరలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యాబినెట్లో చోటు కోసం ఎవరికి వారు తమ తమ వర్గాల ఎమ్మెల్యేల పేర్లను అధిష్టానానికి సిఫార్సు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే సీఎం రేవంత్ రెడ్డి కంటే ముందే భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి రాహూల్ గాంధీని కలిశారని టాక్ వినిపిస్తోంది.ఇదిలా ఉండగా.. గతంలో ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరకలేదట. ఇక చేసేదేమిలేక రేవంత్ సైలెంట్గా తిరిగొచ్చారు. కానీ ఇప్పడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాహుల్ అడగానే అపాయింట్మెంట్ ఇచ్చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలైంది.ఐతే ఈ ప్రచారాన్ని గాంధీ భవన్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమాలు, షెడ్యూల్ వల్లే ఈసారి భట్టితో కలిసి వెళ్లలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏదీ ఏమైనా.. కాంగ్రెస్లో ఎప్పుడు ఏ తుఫాన్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు విశ్లేషకులు.
