కడప /చెన్నూరు: కడప జిల్లా చెన్నూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ నీల్ రోహిత్ రెడ్డికి అమెరికా తెలుగు సంఘం (ATA) నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆయన అందిస్తున్న విశిష్ట వైద్య సేవలను గుర్తించిన ఆటా నిర్వాహకులు అమెరికాలో నిర్వహించే మహాసభలకు ప్రత్యేక ఆహ్వానం అందించారు.ఎయిర్ అంబులెన్స్ సేవల ద్వారా 32 దేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు వైద్య సహాయం అందించి అనేక మంది ప్రాణాలను కాపాడిన డాక్టర్ నీల్ రోహిత్ రెడ్డి సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
అమెరికాలో జరిగే ఆటా మహాసభల్లో ఎయిర్ అంబులెన్స్ సేవలపై ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసి వాటి ప్రాముఖ్యతను వివరించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన అమెరికాకు బయలుదేరారు. జిల్లాకు చెందిన వైద్యుడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.