మైదుకూరు: పట్టణంలోని పొద్దుటూరు రోడ్డులో ఉన్న కోర్టుకు వెళ్లే అప్రోచ్ రోడ్డు నాణ్యంగా ఉన్నప్పటికీ, రోడ్డు పక్కన పేరుకుపోతున్న మట్టి, నిర్మాణ వ్యర్థాలు దాని అందాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉండాల్సిన కోర్టు మార్గం ఇలా వ్యర్థాలతో నిండిపోవడంపై స్థానికులు, న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు ఇరువైపులా మట్టి, నిర్మాణ వ్యర్థాలను పడేయడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొద్దిపాటి గాలి వీచినా దుమ్ము ధూళి ఎగసిపడి ప్రయాణికులు, న్యాయవాదులు, కోర్టుకు వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయదేవత ఆలయంగా భావించే కోర్టుకు వెళ్లే ప్రధాన మార్గం ఈ విధంగా వ్యర్థాలతో కళావిహీనంగా మారడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు నాణ్యత బాగుందని నిర్లక్ష్యం చేయకుండా, దాని పక్కన పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించి, భవిష్యత్తులో అక్కడ చెత్త, మట్టి వేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
