వినాయక నిమజ్జనంలో డీజేలు, ఆర్కెస్ట్రాలకు అనుమతి లేదు
ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించాలి: ఎస్ఐ జె. ధనుంజయుడు
దువ్వూరు: వినాయక చవితి పండుగను దువ్వూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని దువ్వూరు సబ్ ఇన్స్పెక్టర్ జె. ధనుంజయుడు కోరారు. కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు వినాయక నిమజ్జనం సందర్భంగా పలు నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.నిమజ్జనం రోజున డీజేలు, ఆర్కెస్ట్రాలకు ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పండుగ సందర్భంగా ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.నిమజ్జన ఊరేగింపులో ట్రాక్టర్, లారీ, ఆటో తదితర వాహనాలను నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. వాహనాలను జాగ్రత్తగా నడిపి ప్రమాదాలకు అవకాశం లేకుండా చూడాలని సూచించారు.
వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు భద్రతా చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విగ్రహం నిమజ్జనం పూర్తయ్యే వరకు నిర్వాహకులు, వాలంటీర్లు అక్కడే ఉండి భద్రతా చర్యలను పర్యవేక్షించాలని కోరారు.వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పోలీసు శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ సోదరభావంతో పండుగను ప్రశాంతంగా, ఆనందంగా నిర్వహించేందుకు సహకరించాలని ఎస్ఐ జె. ధనుంజయుడు విజ్ఞప్తి చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: