కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి..జెండాలు జతకట్టాయి, అధినేతలు చేతులు కలిపారు, కలిసి సీట్లు పంచుకున్నారు.. కానీ కీలకమైన కోఆర్డినేషన్ను వదిలేశారు. అదే ఇప్పుడు కూటమిలో కల్లోలం రేపుతోంది. నామినేషన్లవేళ ఎక్కడికక్కడ లుకలుకలు బయటపడుతున్నాయి. ప్రత్యర్థుల సంగతి ఏమోగాన.. స్వపక్షంలోనే పోటీని ఎదుర్కొంటున్నారు కూటమి అభ్యర్థులు. నామినేషన్ల పర్వం మొదలైనా కూటమిలో కుంపట్లు మాత్రం ఇంకా చల్లారడం లేదు.శ్రీకాకుళం దగ్గర్నుంచి కర్నూలు వరకు అవే లుకలుకలు, గందరగోళం. ఏదో ఒకటోరెండోకాదు దాదాపు 20కిపైగా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. సొంత పార్టీ నుంచే ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నారు కూటమి అభ్యర్థులు.అరకు లోక్సభ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత.. సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. గీతపై తీవ్ర ఆరోపణలుచేసిన నిమ్మక జయరాజ్.. బీజేపీ రెబల్గా బరిలోకి దిగారు. దాంతో, అరకు కాషాయదళంలో కలవరం మొదలైంది. ఇక, ఎచ్చెర్ల బీజేపీలోనూ అసమ్మతి సెగ కల్లోలం రేపుతోంది.బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు అభ్యర్థిత్వాన్ని యాక్సెప్ట్ చేయడంలేదు స్థానిక బీజేపీ నేతలు. అక్కడ టికెట్ ఆశించిన రమ్య… ఈశ్వరరావుపై రెబల్గా పోటీకి రెడీ అవుతున్నారు. బీజేపీలోనే కాదు టీడీపీలోనూ ఇదే పరిస్థితి. విజయనగరం సీటును మళ్లీ అదితి గజపతిరాజుకే ఇవ్వడంతో రెబల్గా బరిలోకి దిగారు మీసాల గీత. పార్వతీపురంలోనూ సేమ్ సిట్యువేషన్.ఇక్కడ బోనెల విజయ్చంద్రకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దాంతో, టికెట్ ఆశించి భంగపడ్డ ఉదయభాను రెబల్గా బరిలోకి దిగుతున్నారు.ఇక, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టీడీపీలోనూ అసమ్మతి పోరు తీవ్రస్థాయికి చేరింది. ఇక్కడ టీడీపీ మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించడంతో కలమట వెంకటరమణ అసంతృప్తిలో రగిలిపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఈనెల 24న నామినేషన్ వేయబోతున్నారు కలమట. కోస్తాంధ్ర టీడీపీలోనూ రెబల్ బెడద కనిపిస్తోంది. టికెట్ దక్కకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. నూజివీడు బరిలోకి దిగబోతున్నారు.ఆమధ్య వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా.. తెలుగుదేశం సానుభూతిపరుడిగానే పోటీకి రెడీ అవుతున్నారు ముద్దరబోయిన. ఇవన్నీ ఒకత్తయితే ఉండిది మరో లెక్క. ఇక్కడ రాజు వర్సెస్ రాజుగా జరుగుతోన్న ట్రయాంగిల్ ఫైట్… టోటల్ ఏపీలోనే హాట్ టాపిక్కైంది. ముగ్గురి మధ్య టికెట్ ఫైట్ డైలీ సీరియల్గా కొనసాగుతుండగానే… రఘురామరాజు నుంచి నామినేషన్ పడింది.ఉండి రాజకీయం మరింత వేడెక్కింది. మరి, ముందు టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఏంచేస్తారు?. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఏంచేయబోతున్నారనేది ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది. అసలు, ఈ ముగ్గురిలో బీఫామ్ ఎవరికి దక్కబోతుందనేది అంతకుమించి ఇంట్రెస్టింగ్గా మారింది.ఉండిలో ఎంత పొలిటికల్ డ్రామా నడుస్తుందో.. అంతకుమించిన హైడ్రామా అనపర్తిలో నడుస్తోంది. ఇక్కడ కూడా ట్విస్ట్లు మీద ట్విస్ట్లు కార్యకర్తల్ని ఊపిరిబిగపట్టుకునేలా చేస్తున్నాయి. మొదటి లిస్ట్లోనే అనపర్తి అభ్యర్ధిగా నల్లమిల్లి పేరును ప్రకటించారు చంద్రబాబు. కానీ, బీజేపీతో పొత్తు తర్వాత అనపర్తి రాజకీయం ఊహించనివిధంగా మారిపోయింది. అనపర్తి సీటును బీజేపీకి కేటాయించడంతో రచ్చ మొదలైంది ఇక్కడ. నల్లమిల్లి అండ్ ఫ్యామిలీ మూడు వారాలుగా అనపర్తిలో చేసిన న్యాయపోరాటం కూటమిలో కల్లోలమే రేపింది.చివరికి చంద్రబాబు, పురంధేశ్వరి నుంచి నల్లమిల్లికి పిలుపురావడంతో.. అనపర్తిని మళ్లీ టీడీపీకే దక్కుతుందనే ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ రాకుండానే నల్లమిల్లి సతీమణి మహాలక్ష్మి నామినేషన్ వేయడం కూటమిలో కలవరం రేపుతోంది. పైగా కూటమి అభ్యర్థిని తానేనని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రచారం చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది.ఇక, నెల్లూరు జిల్లా కందుకూరులో ఇంటి పోరుతో తలలు పట్టుకుంటున్నారు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వర్ రావు. ఇక్కడ రెబల్గా బరిలోకి దిగుతున్నారు ఇంటూరి రాజేష్. ఇవేకాదు.. చీపురుపల్లి, ఎమ్మిగనూరు, నంద్యాల, మంత్రాలయంలో రెబల్స్ బెడదను ఎదుర్కొంటున్నారు కూటమి అభ్యర్థులు. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి ఈ నెంబర్ మరింత ఎక్కువగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయ్. మరి, విత్డ్రాల్లోపు ఇవన్నీ కుదురుకుంటాయా? లేక కూటమిని కాటేస్తాయో చూడాలి.

previous post
next post