kaleswaram commission: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది.కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో డేట్ కేటాయించి ఆ రోజు విచారణకు రావాలని సూచించింది. కేసీఆర్ కు జూన్ 5, హరీశ్ రావుకు జూన్ 6న, ఈటల రాజేందర్ కు జూన్ 9న రావాలని వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవకతవకలు జరిగాయని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణకు కమిషన్ ను నియమించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు, ఇంజినీరింగ్ ఇతర విభాగాలకు సంబంధించి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో గడువును పలుమార్లు ప్రభుత్వం పొడిగించింది.కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ గడువు ఈనెల 31తో ముగియనుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగించింది. జులై 31వరకు పొడిగిస్తూ సోమవారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్టు అందజేసేందుకు సిద్ధమైంది. అధికారులు, ఇంజనీర్లను విచారించి రిపోర్టుకు తుది మెరుగులు దిద్దుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం అకస్మాత్తుగా కమిషన్ విచారణ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించి నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ను విచారణకు పిలుస్తారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే కమిషన్ కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్లకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో ఉన్నారు. హరీశ్ రావు సిద్ధిపేటలో ఉన్నారు. అయితే, తమకు ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు అందలేదని హరీశ్ రావు తెలిపారు.సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైంది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతుంది. ఈ విచారణలో భాగంగా నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ ఎకౌంట్స్ , నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు.. ఇలా అందరిని విచారించింది. ముందుగా వంద రోజుల్లో విచారణ పూర్తి చేయాలనే లక్ష్యంతో కమిషన్ ముందుకు వెళ్లింది. దాదాపు వందకుపైగా అధికారులు, ఇంజనీర్లను కమిషన్ విచారణకు పిలిచింది. ఈనెల 21న లేదా 22న జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం మళ్లీ రెండు నెలలుపాటు కమిషన్ విచారణ గడువును పెంచింది. గతంలోనూ ప్రభుత్వం పలు సార్లు కమిషన్ గడువును పొడిగించింది.

previous post