బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తుఫాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలోనూ తుఫాను ప్రభావం కనిపించింది. బాపట్ల వద్ద తీరం దాటిన తుఫాను అల్పపీడనంగా మారింది.*ప్రస్తుతం కోసా, దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ను ఆనుకొని తెలంగాణలోని ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతున్నది.ఛత్తీస్గఢ్ వైపు నుంచి పయనించి గురువారం పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. శుక్రవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.మరో వైపు హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత పెరిగింది. తుఫాను ప్రభావంతో మూడురోజులుగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పలుచోట్ల తెల్లవారు జామున పొగ మంచు కప్పేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
