ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులపై రోజుకో సంచలనం వెలుగులోకి వస్తోంది. ఆమె ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఆరుగురు ఎమ్మెల్యేలను తనతో తీసుకొస్తానని కాంగ్రెస్ హైకమాండ్తో కవిత రాయబారం చేశారని.. పార్టీ పెద్దలు ఒప్పుకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకించడంతో బ్రేక్ పడిందనే వార్తలు వచ్చాయి. అయితే అది ఫేక్ న్యూస్ అని కవిత ఖండించింది. తనపై వరుసగా జరుగుతున్న ప్రచారాలపై కవిత క్లారిటీ ఇచ్చారు. BRSను బీజేపీలో కలపాలని చూస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీలో పార్టీని విలీనం చేయవద్దని చెప్పానని తెలిపారు. తనకు నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. కేసీఆర్ నీడలో పని చేస్తున్న వాళ్లు.. తనపై ప్రతాపం చూపిస్తున్నారని కవిత విమర్శించారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు చేయడం రాదన్నారు. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని కవిత ప్రశ్నించారు. తాను రాసిన లేఖను బయట పెట్టింది ఎవరో తేల్చాలన్నారు. కేసీఆర్ లానే తాను ఎవరికి భయపడేది లేదని కవిత తేల్చి చెప్పారు. ఇక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనంపై కవిత సంచలన కామెంట్స్ చేశారు. గులాబీ పార్టీని కమలం పార్టీలో కలపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, దీన్ని తాను జైల్లో ఉన్నప్పుడే వ్యతిరేకించినట్టు చెప్పుకొచ్చారు. కానీ తాను బ్రతికిఉండగా బీఆర్ఎస్పార్టీ బీజేపీలో విలీనం కుదరదని తేల్చి చెప్పినట్టు ప్రకటించారు. అందుకే తనను పార్టీలో నుంచి సైడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా కేటీఆర్ను ఉద్దేశించి కవిత పరోక్ష విమర్శలు చేశారు. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు, నీతులు చెప్పడం మానండి అని తీవ్రంగా విమర్శించారు. అందుకే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని డబ్బులు ఇచ్చి తనను తిట్టిస్తున్నారని ఆరోపించారు. నేను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను, ఇంకెవరి నాయకత్వంలోనూ పనిచేయను అని స్పష్టం చేశారు. పార్టీలోని లీకు వీరులు తన లేఖను బహిర్గతం చేశారని, వారిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్కు నోటీసులు జారీ అయినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఊరూరా నిరసనలు చేయకుండా ట్విట్టర్లో సందేశాలకే పరిమితమయ్యారని విమర్శించారు.మరోవైపు గత ఇరవై ఐదు ఏళ్లుగా తాను కేసీఆర్కు లేఖలు రాస్తున్నట్టు కవిత తెలిపారు. లేఖలు చదివి, వాటిని తన తండ్రి చించేస్తుంటారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు లేఖ ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించినందుకు ఆడబిడ్డ అయిన తనపై పెయిడ్ ఆర్టిస్ట్లతో రాజకీయ దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. అయినా తన తండ్రికి లేఖలు రాస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. ఏదైనా వుంటే పార్టీ ఫోరమ్లోనే చర్చించాలని కేటీఆర్ అనడాన్ని కవిత తప్పు పట్టారు. అటు కొత్త పార్టీ పెట్టడంపైన కవిత స్పందించారు. పార్టీ పెట్టబోనని ఎలా చెప్పగలనని చిట్చాట్లో స్పష్టం చేశారు. జైలులో ఉన్నప్పుడు బీజేపీలో పార్టీ విలీన ప్రతిపాదన చేశారని అప్పుడే తాను నో చెప్పినట్లు తెలిపారు. తనపై కుట్ర జరుగుతోందని.. తనను కేసీఆర్కు దూరం చేయాలని చూస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తమకు కేసీఆర్ తప్ప మరో లీడర్ లేడని స్పష్టం చేశారు. తన లేఖను లీక్ చేసినవాళ్లు ఎవరో కావాలని కవిత డిమాండ్ చేశారు. మొత్తంమీద ఎమ్మెల్సీ కవిత కామెంట్లపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. తర్వాత పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసే ఆలోచనలో గులాబీ పార్టీ పెద్దలు ఉన్నారని చెబుతున్నారు. తనకు లేఖ రాయడంపైనే కేసీఆర్ అసహనంతో ఉన్నారంటున్నారు. ఇక పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను బహిర్గతంగా మాట్లాడొద్దని సూచించినా.. కవిత మళ్లీ కామెంట్లు చేయడంపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని టాక్. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ తాజా పరిస్థితులపై పార్టీ నేతలతో ఆరా తీశారని తెలుస్తోంది.

previous post