మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి అరెస్ట్తన భర్త అరెస్ట్ అక్రమమంటూ అర్ధరాత్రి రోడ్డుపై లక్ష్మి నిరసనచెవిరెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని ధీమావైసీపీ నేత, చంద్రగిరి మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న బెంగళూరు విమానాశ్రయంలో ఈ అరెస్ట్ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఈ అరెస్ట్ను ఖండిస్తూ ఆయన సతీమణి లక్ష్మి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తన భర్త నిర్దోషి అని, కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నిన్న బెంగళూరు విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయనపై అప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయి ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న సిట్ అధికారులు హుటాహుటిన బెంగళూరుకు చేరుకుని చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను విజయవాడకు తరలించారు.చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అరెస్ట్ విషయం తెలియగానే ఆయన సతీమణి లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఏ తప్పూ చేయలేదని, ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించారు. ఈ అరెస్ట్కు నిరసనగా ఆమె అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఏ తప్పు చేయని చెవిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు” అని లక్ష్మి అన్నారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని, తన భర్త కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటకు వస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే చెవిరెడ్డి విడుదల అవుతారని ఆమె పేర్కొన్నారు.
