ఇటీవల చాలా మంది తమ ఇళ్లలో పెద్దవాళ్లను చూసుకునేందుకు కేర్ టేకర్లను నియమించుకుంటున్నారు.
అంతే కాకుండా ఇంట్లో భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే, తమ పిల్లలను, ఇంటిని జాగ్రత్తగా చూసుకునేందుకు తెలిసిన వారు లేదా కన్సల్టెన్సీలను సంప్రదించి పనివాళ్లను పెట్టుకుంటున్నారు.
కానీ వాళ్లే నమ్మించి నట్టెట ముంచుతున్నారు.
బంగారం, నగదు కోసం దారుణాలకు వెనుకాడటం లేదు.
కర్నూలు నగరంలోని సాయి వైభవ్ నగర్ లో కాటసాని శివలీల అనే 75 ఏళ్ల వృద్ధురాలు కూతురు ఉమామహేశ్వరి అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి ఉంటుంది. భర్త సాంబశివరెడ్డి ఇటీవల మృతి చెందారు. కూతురు స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇంటిలో వరలక్ష్మీ అనే మహిళ పనిమనిషిగా చేస్తూ మూడు రోజుల క్రితమే మానేసింది. తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 2) తెల్లారుజామున ఇంట్లో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న శివలీలను అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి గుర్తించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
శివలీ కొడుకు గంగాధర్ రెడ్డి అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డారు. వృద్ధురాలు కూతురు వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా ఆమె హతమార్చారు. శివలీలపై మెడలో చేతులకు ఉండాల్సిన బంగారు ఆభరణాలు లేకపోవడంతో ఆ బంగారం కోసమే కొట్టి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మూడు రోజుల క్రితమే పని మానేసిన వరలక్ష్మిని అనుమానంగా భావిస్తున్నట్లు కూతురు ఉమామహేశ్వరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.