ఈవీఎం గోదాముల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి– జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
రాయచోటి, జూలై 27:ఈవీఎం గోదాముల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మాసవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం ఉదయం రాయచోటి పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు (BU), కంట్రోల్ యూనిట్లు (CU), వీవీప్యాట్ (VVPAT) యంత్రాలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. అలాగే గోదాములో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, సీలింగ్ విధానం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన సందేహాలకు జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ ఏ. శ్రీనివాస్, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.