అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగించేలా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
ఆగస్టు 1 నుంచి బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కేజీ రూ.52కు, గ్రేడ్-1 పచ్చి బియ్యాన్ని కేజీ రూ.50కు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ఈ బియ్యం అందుబాటులో ఉండనుంది.
ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు. పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఆయన అభినందించారు.
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను సమీక్షించి, రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించిన అనంతరం ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యాన్ని అందించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.