Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్కు సర్వం సిద్ధం అయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్నిరకాలా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. నాలుగో విడతలో ఏపీ, తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాల్లో రేపు పోలింగ్ జరగనుంది. నాలుగో విడతలో 96 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఏపీ(25), తెలంగాణ (17), బిహార్(5), ఝార్ఖండ్(4), మధ్యప్రదేశ్(8), మహారాష్ట్ర(11), ఒడిశా(4), యూపీ(13), ప.బెంగాల్(8), జమ్ముకశ్మీర్(1) స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.లోక్ సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇదే విడతలో పోలింగ్ నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఈ విడతలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్లో కన్నౌజ్తో పాటు షాజహాన్పూర్, ఖేరీ, ధౌరహర, సీతాపూర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఎటా, కాన్పూర్, అక్బర్పూర్, బహ్రైచ్ నియోజవర్గాల్లో రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు. 4వ విడతలో పోటీలో ఉన్న ప్రముఖుల్లో అఖిలేష్తో పాటు టీఎంసీ నేతలు మహువా మొయిత్ర వెస్ట్ బెంగాల్ కృష్ణనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు.అలాగే తృణముల్ కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా ఆసన్సోల్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ ముఖ్య నేతలు గిరిరాజ్ సింగ్ బీహార్లోని బేగుసరాయి నియోజకవర్గంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఝార్ఖండ్ నుంచి ఖుంటి నియోజకవర్గంలో అర్జున్ ముండా పోటీ చేస్తున్నారు. మూడో విడతలో అధికారంలో ఉన్న అమిత్ షా వంటి అగ్రనేతలు బరిలో నిలిస్తే ఇప్పుడు ప్రతిపక్షంలోని ముఖ్యనేతలు ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆసక్తిగా మారింది.
