విశాఖపట్నం యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని విశాఖ నగర పోలీస్ శాఖ హార్బర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (లా అండ్ఆర్డర్) ఎన్. కాళిదాస్ అన్నారు. వేదాంత వి.జె.సి.బి పోర్ట్, అఫ్రో(ఏఎఫ్పిఆర్) యాక్షన్ ఫర్ ఫుడ్ ప్రొడక్షన్ సంయుక్త సారధ్యంలో శుక్రవారం ఉదయం పాత పోస్టాఫీస్ సమీపంలో ఉన్న ఫిషరీస్ కమ్యూనిటీ హాల్ లో మత్తు పదార్థాల వినియోగం నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హార్బర్ అసిస్టెంట్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) ఎన్. కాళీదాస్ పాల్గొని మాట్లాడుతూ గంజాయి, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్నో ఆశలతో చదివిస్తున్నారని, వారి ఆశయాలను నెరవేర్చి ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. గౌరవ అతిధిగా పాల్గొన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. దేముడు బాబు మాట్లాడుతూ. మాదకద్రవ్యాల వాడకం, అమ్మకాలు చట్టరీత్య నేరమని, డ్రగ్స్ కు అలవాటు పడేవారు నేరాలు చేసేందుకు కూడా వెనుకాడరన్నారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాల ప్రభావాలకు లొంగకుండా గురువులు నేర్చిన క్రమశిక్షణతో జీవితంలో ఉన్నత లక్ష్యం చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హార్బర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎన్. కాళిదాస్ అందరి చేత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా తయారుచేసిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హిమ హ్యూమానిటేరియన్ అసోసియేషన్ వైన్ ప్రెసిడెంట్ పొలమర శెట్టి సంతోష్, హిమ హ్యుమానిటేరియన్ అసోసియేషన్ ఫౌండర్ టీ.వి.డి. దాస్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వై. అశోక్ కుమార్, ప్రాజెక్ట్ మేనేజర్ కే. విజయ భాస్కర్, వైజాగ్ జనరల్ కార్లో బర్త్ ప్రైవేట్ లిమిటెడ్ (వీజీసీబీ ) సి.ఎస్. ప్రతినిధి కే.సాయిఫ్ ఖాన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వి.కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
