భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది..శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కారు చెరువులో మునగడంతో ఐదుగురు యువకులు మృతి చెందారు. పోలీసులు వారి మృతదేహాలను వెలికితీశారు..మృతులను హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్గా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులున్నారు. మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా 20 నుంచి 21 ఏళ్ల వయసు లోపు వారే. శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి వీరు బయలుదేరినట్లు సమాచారం. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భూదాన్ పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

previous post