తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం చెర్లోపల్లి బ్రిడ్జి సమీపంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుల వద్ద నుంచి రూ.1,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు కొనసాగుతోంది.జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో రేణిగుంట సబ్-డివిజన్ పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.
ప్రాథమిక విచారణలో అరెస్ట్ అయిన నిందితులు గంజాయిని సేకరించి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరికి సరఫరా చేస్తున్నారు? ఈ వ్యవహారం వెనుక ఉన్న నెట్వర్క్ ఎవరిది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం అవసరమని పోలీసులు తెలిపారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
“మాదకద్రవ్యాలకు నో చెప్పండి – యువత భవిష్యత్తును కాపాడండి” అంటూ తిరుపతి జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: