గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు
కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గం – దువ్వూరు:
వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు దువ్వూరు మండలంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా తెలుగు గంగ చల్లబసాయపల్లె డ్యామ్, కేసీ కెనాల్తో పాటు ఇతర గణేష్ నిమజ్జన ప్రదేశాలను పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా సందర్శించారు.దువ్వూరు సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ధనుంజయుడు ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో స్థలం చదునుగా ఉందా, వాహనాల రాకపోకలకు, భక్తుల సంచారానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు.
రాత్రి వేళల్లో నిమజ్జనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగినంత విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అలాగే ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తగా చెరువులు, నీటి వనరుల్లో నీటి లోతును పరిశీలించారు.లోతైన, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు, సురక్షిత సరిహద్దులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నిమజ్జన సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్, పోలీస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ పరిశీలనలో ఏఎస్ఐ సుబ్బయ్య, డిప్యూటీ తహసిల్దార్ నాగస్వరూప్, విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: