కడప మేయర్ సురేశ్ బాబు పై అనర్హత వేటు పడింది. విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా మేయర్ పదవి నుంచి సురేశ్ బాబును తొలగిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం జీవో జారీ చేశారు. కడప నగరంలో అభివృద్ధి పనులను ఇష్టారాజ్యంగా తన కుటుంబానికి చెందిన గుత్తేదారు సంస్థ ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్స్ ద్వారా చేయించినట్లు విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. మేయర్ పదవిని అనుభవిస్తూ ప్రత్యక్షంగా/ పరోక్షంగా ఆయన కుటుంబసభ్యులు గుత్తేదారు పనులు చేయవచ్చా?.. చేయరాదనే విషయం మేయర్ దృష్టికి తీసుకెళ్లారా?.. మొత్తంగా వర్ధిని కంపెనీ ఎన్ని పనులు చేపట్టిందనే విషయాలు రాబట్టింది. గుత్తేదారు కంపెనీ డైరెక్టర్లుగా మేయర్ కుమారుడు అమరేశ్, భార్య జయశ్రీ ఉన్నారు. పురపాలక చట్టం నిబంధనలు అతిక్రమించినందున పదవులకు అనర్హులవుతారనే సమాచారాన్ని కమిషనర్ మనోజెడ్డి నుంచి రాతపూర్వకంగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని మేయర్ కు సైతం తెలియజేస్తూ కమిషనర్ లేఖ రాశారు. మంగళవారం మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎదుట హాజరై సురేష్ బాబు వివరణ ఇచ్చారు. కమిషనర్ ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి విచారణ నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.36లక్షలు అవినీతికి పాల్పడినట్టు సురేష్ బాబుపై ఆరోపణలున్నాయి.

previous post