ప్రతి మనిషికి కష్టాలు, సమస్యలు సహజం. సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా కాస్తా మనసు పెడితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఇట్టే దొరుకుతుందిఅందుకు పెద్ద, పెద్ద చదువులు చదుకోవాల్సిన అవసరం లేదని గతంలో చాలా మంది నిరూపించారు. తాజాగా ఓ దర్జీ కూడా అదే బాటలో పయనించాడు. ప్రస్తుతం టైలరింగ్ వృత్తిలో అనేక మార్పులు వచ్చాయి. రెడీమేడ్ దుస్తువులు, డిజైనరీ బోటిక్స్ పుణ్యమా అని సాధారణ టైలర్లకు చేతినిండా పనిలేకుండా పోతోంది. దీంతో పూట గడవని స్థితిలోకి కొంతమంది టైలర్లు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కృష్టా జిల్లాకు చెందిన టైలర్ షేక్ కాలేషా వినూత్నంగా ఆలోచించాడు. ప్రస్తుత రోజుల్లో అన్ని సేవలు ఇంటి వద్దకే రావటాన్ని గమనించి, టైలరింగ్ సేవలను కూడా ఇంటి వద్దకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. మరీ ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.కృష్ణాజిల్లా పెనమలూరు మండలం వణుకూరుకు చెందిన షేక్ కాలేషా టైలర్ వృతితో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తొలుత గ్రామంలో టైలరింగ్ దుకాణాన్ని నిర్వహించేవాడు. అయితే, కాలక్రమేణ షాపుకు ఆదరణ తగ్గిపోయింది. కొంత మంది బట్టలు కుట్టించుకున్నా ఇచ్చే మొత్తం కంటే, అప్పులు పెట్టేదే ఎక్కువైంది. దీంతో కుటుంబ జీవనం కష్టంగా మారింది. వేరే పని వెత్తుకుందామా అంటే.. తెలిసింది టైలరింగ్ పని ఒక్కటే. టైలరింగ్ వృత్తి ద్వారానే ఏదో విధంగా ఆదాయం పెంచుకోవాలని భావించాడు. ఈ క్రమంలో మొబైల్ టైలరింగ్ ద్వారా ఉపాధి పొందాలనుకున్నాడు.ఈ ఆలోచనలో భాగంగా తొలుత ఓ రిక్షాను కొని దానికి కుట్టుమిషన్ను అనుసంధానించాడు. ఎక్కడికైనా తీసుకుని వెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేశారు. గ్రామంలో కాలనీల్లో తిరుగుతూ ఇంటి వద్దే పాత, చిరిగిన బట్టలు కుట్టడం ప్రారంభించాడు. ఈ సేవలకు మంచి ఆదరణ లభించటంతో.. టీవీఎస్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి పొరుగుళ్లకు తన సేవలను విస్తరించుకున్నాడు. రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ ఉపాధి పొందుతున్నాడు. ప్రస్తుతం అవసరం ఉన్న వాళ్లు కాలేషాకు ఫోన్ చేసి మరీ పిలింపించుకుని బట్టలు కుట్టించుకుంటారు. షాపు నిర్వహించటం కన్నా మొబైల్ టైలరింగ్ సేవలతోనే లాభాం ఉందని కాలేషా చెబుతున్నాడు.
