సైబర్ నేరాలు పెరుగుతున్న వేళ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బ్యాంకు సంబంధిత లావాదేవీలు, సేవలకు సంబంధించి ఇకపై +91-1600తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచే కాల్స్ చేయనున్నట్లు తెలిపింది. డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో మోసాల పట్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్న వేళ.. ఏయే నంబర్ల నుంచి కాల్స్ చేయబోయేదీ ఎస్బీఐ తన ఎక్స్ పోస్ట్లో వెల్లడించింది.కస్టమర్లకు 1600 సిరీస్తో మొదలయ్యే నంబర్ల నుంచే కాల్ చేయాలంటూ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ ఈ ఏడాది జనవరిలో సూచించింది. ఒకవేళ మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ కోసమైతే 1400 సిరీస్ను వినియోగించాలని తెలిపింది. దీనివల్ల ఏది నమ్మదగినది, ఏది మోసపూరిత ఫోన్ కాలో తెలుసుకోవడానికి సాధ్యమవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఆయా నంబర్ల వివరాలను పొందుపరిచింది. ‘‘+91-1600 తో ప్రారంభమయ్యే నంబర్ నుంచి మీకు కాల్ వస్తే అది నిజమైన, చట్టబద్ధమైన కాల్ అని నిర్ధారించుకోండి. లావాదేవీ, సేవలకు సంబంధిత కాల్స్ కోసం మాత్రమే వీటిని వినియోగిస్తాం. స్పామ్, మోసపూరిత కాల్స్ నుంచి వీటిని వేరు చేయడంలో ఈ నంబర్లు ఉపయోగపడతాయి’’ అని ఎస్బీఐ తన అడ్వైజరీలో పేర్కొంది.
