అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు చేస్తున్న రెవెన్యూ సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపింది. పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ దస్త్రాలను కలిగి ఉన్న సిబ్బంది ఇళ్లపై దాడులు చేయించారు. రాయచోటి మండలం సిబ్యాలలో మాజీ వీఆర్వో నాగరాజు ఇంట్లో రెవెన్యూ అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. వీఆర్వోగా పనిచేసిన నాగరాజు గతంలో భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, అడంగల్, డీకేటీ పట్టాలు తయారు చేసినట్లు గుర్తించారు.ఆయన మరణించినా కుటుంబ సభ్యులు కూడా ఇదే పంథా కొనసాగిస్తున్నట్లు తేలడంతో ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. నాగరాజు ఇంట్లో పెద్ద ఎత్తున నకిలీ రికార్డులు, డీకేటీ పట్టాలు బయటపడ్డాయి. రాయచోటి పట్టణంలోని డిప్యూటీ తహసీల్దార్, మరో రెవెన్యూ సిబ్బంది ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా నకిలీ పట్టాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వీటిపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆరా తీస్తున్నారు. భూముల ఆక్రమణదారుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుని రెవెన్యూ సిబ్బంది ఇలాంటి నకిలీ పట్టాలు సృష్టించినట్లు తెలుస్తోంది.
