Iదేశవ్యాప్తంగా లోన్ రికవరీ పేరుతో కస్టమర్లపై జరుగుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రుణగ్రహీతల గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు రక్షణ కల్పించేలా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఈ నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఎవరినైనా రికవరీ ఏజెంట్లుగా నియమించడానికి వీలు ఉండదు. కేవలం శిక్షణ పొంది, గుర్తింపు పొందిన సంస్థల నుంచి ధ్రువపత్రాలు కలిగిన వారినే బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు నియమించాలి. ముఖ్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) లేదా గుర్తింపు పొందిన సంస్థల సర్టిఫికేషన్ తప్పనిసరి చేయనున్నారు. అలాగే రికవరీ ఏజెంట్ల వివరాలను బ్యాంకులు తమ వెబ్సైట్లు, మొబైల్ యాప్లలో ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది.కస్టమర్లను సంప్రదించే విధానంలో కూడా RBI కఠిన నియమాలు తీసుకొచ్చింది. రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లను సంప్రదించాలి. ఇంటికి మొదటిసారి వెళ్లే ముందు కనీసం ఒక రోజు ముందుగా సమాచారం ఇవ్వడం తప్పనిసరి. అసభ్య పదజాలం ఉపయోగించడం, బెదిరించడం, పదే పదే కాల్స్ చేసి మానసిక ఒత్తిడి కలిగించడం పూర్తిగా నిషేధించారు.అంతేకాకుండా, రుణగ్రహీతల కుటుంబ సభ్యులు, బంధువులు, సహోద్యోగులను వేధించడం లేదా అప్పు విషయాన్ని బయట పెట్టి అవమానించడం ఇకపై కఠినంగా నిషేధం. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం, ఆడియో లేదా వీడియో రికార్డింగులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని కూడా RBI పూర్తిగా నిషేధించింది. మొబైల్ ఫోన్లోని కాంటాక్ట్స్, ఫోటోలు, ఇతర వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడం లేదా స్టోర్ చేయడం కూడా చట్టవిరుద్ధంగా పరిగణించనుంది.మొబైల్ ఫోన్ కొనుగోలు కోసం తీసుకున్న లోన్ల విషయంలో కూడా కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. EMIలు చెల్లించకపోయినా, 90 రోజులు గడిచిన తర్వాత మాత్రమే ముందస్తు నోటీసుతో ఫోన్ లాక్ చేయాలి. అయితే ఫోన్ లాక్ చేసినా ఇంటర్నెట్ సేవలు, ఇన్కమింగ్ కాల్స్, అత్యవసర SOS సేవలు, ప్రభుత్వ భద్రతా అలర్ట్లను నిలిపివేయరాదు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా సేవలు నిలిపితే, ప్రతి గంటకు రూ.250 చొప్పున కస్టమర్కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.రికవరీ ప్రక్రియలో పారదర్శకత కోసం బ్యాంకులు ప్రతి కాల్ సమయం, నంబర్, సంభాషణను రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ కాల్ రికార్డులను కనీసం ఆరు నెలల పాటు భద్రపరచాలి. కోర్టు వివాదాలు ఉంటే కేసు ముగిసే వరకు డేటాను భద్రపరచాలని RBI సూచించింది.ఈ కొత్త నిబంధనలతో రుణగ్రహీతల హక్కులు, గౌరవం, వ్యక్తిగత గోప్యతకు పూర్తి రక్షణ లభిస్తుందని RBI వెల్లడించింది. లోన్ రికవరీ పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలకు ఇది గట్టి చెక్ అవుతుందని భావిస్తున్నారు.

