తిరువణ్ణామలై, జూలై 26: తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ (మోక్ష మార్గం) వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ భక్తుడు గుహలో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందాడు.
మృతుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన మణికుమార్ (36)గా గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరువణ్ణామలైలోని శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శనివారం అర్ధరాత్రి సమయంలో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయానికి చేరుకున్నారు.ఈ ఆలయంలోని గుహ ఆకారపు ఇరుకైన మార్గాన్ని భక్తులు వెనుక ద్వారం నుంచి ప్రవేశించి పాకుతూ ముందువైపు ద్వారం గుండా బయటకు వస్తుంటారు. దీనిని తెలుగు భక్తులు “మోక్ష మార్గం”గా పిలుస్తారు.అయితే మణికుమార్ శరీరాకృతి లావుగా ఉండటంతో గుహ మధ్యలోనే ఇరుక్కుపోయారు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎక్కువసేపు గుహలోనే చిక్కుకుపోవడంతో ఆయనకు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నారు.
సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, ఇతర భక్తులు తీవ్రంగా శ్రమించి ఆయనను బయటకు తీసి 108 అంబులెన్స్లో తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనతో మణికుమార్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, అరుణాచల యాత్రకు వచ్చిన భక్తుల్లో తీవ్ర విషాదం నెలకొంది.