కాశీలో తెలుగు వైభవం.. ఎటు చూసినా తెలుగు నేమ్ బోర్డులే!
వారణాసి: హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే కాశీ (వారణాసి)లో తెలుగు భాష వైభవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏటా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కాశీ విశ్వనాథుడి దర్శనానికి తరలివెళ్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తెలుగు నేమ్ బోర్డులు, సూచికలు ఏర్పాటు చేశారు.
తెలుగు యాత్రికుల కోసం ఆంధ్ర ఆశ్రమం, శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం, మార్కండేయ ఆశ్రమం, అన్నపూర్ణ యాత్రి భవన్ ఛారిటబుల్ ట్రస్ట్, వారాహి కల్పతరువు ట్రస్ట్ వంటి సత్రాలు సేవలు అందిస్తున్నాయి. పూజలు, పిండప్రదానాలు నిర్వహించేందుకు తెలుగు పురోహితులు కూడా అందుబాటులో ఉండటం విశేషం.
కాశీలో తెలుగు భాషకు లభిస్తున్న ఈ ప్రాధాన్యానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాశీ వీధుల్లో తెలుగు నేమ్ బోర్డులు కనిపించడం తెలుగు ప్రజలకు గర్వకారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగు భక్తుల సంఖ్య అధికంగా ఉండటమే ఈ మార్పుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.