ప్రొద్దుటూరులో ఐస్క్రీమ్ల వ్యాపారం ముసుగులో గంజాయి విక్రయిస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన 33 ఏళ్ల పింటు కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మొత్తం 1.280 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు ఏఎస్పీ యు. విభు కృష్ణన్, ఐపీఎస్ తెలిపారు.యూపీలోని కనౌజ్ జిల్లాకు చెందిన పింటు కుమార్.. ప్రొద్దుటూరులోని ఈశ్వర్ రెడ్డి నగర్లో నివాసముంటూ ఐస్క్రీమ్లు విక్రయించేవాడు. ఈ వ్యాపారం ముసుగులో గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా వ్యసనపరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.మంగళవారం ఉదయం రామేశ్వరం ప్రాంతంలోని ఆర్టీపీపీ క్రాస్రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు ప్రొద్దుటూరు వన్టౌన్ ఇన్స్పెక్టర్ టి.వి. కొండారెడ్డి, ఎస్సై జి. మధుసూదన్ రెడ్డికి సమాచారం అందింది. దీంతో పోలీసులు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులతో కలిసి ఆకస్మికంగా దాడి చేశారు. ఉదయం 8:15 గంటలకు పింటు కుమార్ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి 1,220 గ్రాముల గంజాయితో పాటు చాక్లెట్ల రూపంలో ప్యాక్ చేసిన 11 గంజాయి ప్యాకెట్లు (60 గ్రాములు) స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1,280 గ్రాముల గంజాయి, దీని విలువ సుమారు రూ.20 వేలుగా అధికారులు తెలిపారు.నిందితుడిపై ఎన్డిపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎవరికి విక్రయించేవాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: