హైదరాబాద్: వైఎస్ వివేకాను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతుంటే.. వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు..హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదన్నారు. వైఎస్ వివేకా హత్యపై ఐదేళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఎన్ని కష్టాలుంటాయో ఇప్పుడు అర్థమైందని చెప్పారు. తనకు చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి అని వివరించారు. అవినాష్ రెడ్డిని గెలవకుండా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. తన పోరాటం రాజకీయం కోసం కాదని.. న్యాయం కోసమని స్పష్టం చేశారు..”2009కి ముందు వైఎస్ఆర్, వివేకా ఎవరో ఒకరు కడప ఎంపీగా పోటీ చేశారు. వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో జగన్ ఎంపీగా ఉన్నారు. పులివెందులలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై చర్చ జరిగింది. చర్చలో వైఎస్ భాస్కర్ రెడ్డి పేరు ముందుకు వచ్చింది. ఆయన పోటీ చేయడాన్ని వివేకా అంగీకరించలేదు. షర్మిల లేదా విజయమ్మ పోటీ చేయాలని వివేకా చెప్పారు. ఈ సమయంలో వివేకాకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే.. దీనిని జగన్ వ్యతిరేకించారు. ఆ తర్వాత జగన్, విజయమ్మ కాంగ్రెస్కు రాజీనామా చేసి బయటకు వచ్చారు. 2011 ఉప ఎన్నికలో జగన్, విజయమ్మ పోటీ చేశారు. ఆ తర్వాత జగన్తో ఉండాలని నిర్ణయించి వివేకా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు”..”ఆ తర్వాత సీబీఐ కేసుల్లో జగన్ అరెస్టయి జైలులో ఉన్నారు. షర్మిల పార్టీని భుజాన వేసుకుని నడిపించింది. జగన్ వెంట వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో షర్మిల ప్రచారం చేసి గెలిపించారు. ఉప ఎన్నికల్లో విజయం తర్వాత షర్మిలకు ఆదరణ వస్తోందని పక్కనపెట్టారు. 2014 ఎన్నికల్లో కడప నుంచి ఆమె పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే.. ఆ స్థానాన్ని అవినాష్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఇది వివేకాకు ఇష్టం లేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమిపాలయ్యారు. అవినాష్ కుటుంబం వెన్నుపోటుతో ఆయన ఓటమిపాలైన విషయం స్పష్టమైంది. నా కుటుంబంలోని వారే వివేకాను హత్య చేశారని నేను మొదట నమ్మలేదు. వారిని సంపూర్ణంగా విశ్వసించడం నేను చేసిన పొరపాటు” అని ఆమె అన్నారు..
