మాచవరం రైల్వే స్టేషన్లో రైలు నుంచి జారిపడి యువతి మృతి
మాచవరం, జూలై 22: మాచవరం రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సుమారు 25 సంవత్సరాల లోపు వయస్సు గల గుర్తుతెలియని యువతి రైలు నుంచి జారిపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎల్. సరస్వతి తెలిపారు.
టికెట్ కలెక్టర్ (టీసీ) ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు పరిశీలించారు. యువతి ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.
మృతురాలి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, ఆమె వేషధారణను బట్టి ఇతర రాష్ట్రానికి చెందిన మహిళ అయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ పోలీసులు వెల్లడించారు. మృతురాలి గుర్తింపు కోసం వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.