సంగారెడ్డి: వ్యాపారం పేరుతో నమ్మకం సంపాదించి, చిట్టీల పేరుతో మహిళల నుంచి సుమారు రూ.3 కోట్లు వసూలు చేసి పరారైన దంపతుల ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన శిరీష, సాంబశివరావు దంపతులు గత 20 ఏళ్లుగా బీరంగూడ BSR కాలనీలో నివాసం ఉంటూ సాయి గణేష్ టెక్స్టైల్స్ పేరుతో వస్త్ర దుకాణం నిర్వహించేవారు. స్థానిక మహిళలతో పరిచయం పెంచుకుని చిట్టీలు నిర్వహిస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకున్నారు.చిట్టీ డబ్బులను తన వద్ద పెట్టుబడిగా పెడితే అధిక వడ్డీ ఇస్తానని శిరీష మహిళలను నమ్మించింది. దీంతో సుమారు 50 మంది మహిళలు తమ చిట్టీ సొమ్మును ఆమెకు అప్పగించారు. మొదట కొంతకాలం వడ్డీ చెల్లించిన దంపతులు, తర్వాత డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేశారు.
బాధితులు నిలదీయడంతో కొందరికి ఖాళీ చెక్కులు ఇచ్చి నమ్మించారు. అనంతరం బట్టల దుకాణాన్ని, ఇంటిని రహస్యంగా విక్రయించి రాత్రికి రాత్రే పరారయ్యారు.
తాము మోసపోయామని గ్రహించిన బాధితులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దంపతుల కోసం గాలింపు చేపట్టగా, తమ కష్టార్జితాన్ని తిరిగి ఇప్పించాలని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: