న్యూఢిల్లీ, ఆగస్టు 11: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ఇండియన్ ముజాహిదీన్, అల్ఖైదా, ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలతో పోస్టర్లు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
పోస్టర్లలో ఉగ్రవాదుల వివరాలను పొందుపరిచి, వీరిలో ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
మరోవైపు ఎర్రకోట పరిసరాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సుమారు 15 నుంచి 20 వేల మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని భద్రత కోసం మోహరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఢిల్లీ వ్యాప్తంగా నిఘా, తనిఖీలను ముమ్మరం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: