గొర్రెల పంపిణీ రుణాల్లో అక్రమాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రస్తావన
అమరావతి, ఆగస్టు 19: గత ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన రుణాల వ్యవహారంలో అవకతవకలపై మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అసెంబ్లీలో ప్రశ్నించారు.జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే.. జిల్లాలో సుమారు 75 ప్రాథమిక గొర్రెల పంపిణీ సంఘాలు ఉండగా, వాటి పరిధిలో దాదాపు 600 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. NCDC సబ్సిడీ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ.2.80 లక్షల వరకు రుణం మంజూరైనట్లు సమాచారం ఉన్నప్పటికీ, కొంతమందికి కేవలం రూ.30 వేల వరకు మాత్రమే అందినట్లు ఫిర్యాదులు ఉన్నాయని సభ దృష్టికి తీసుకెళ్లారు.రుణాలకు సంబంధించిన మిగిలిన మొత్తంపై స్పష్టమైన వివరాలు లేవని, ప్రస్తుతం కొంతమంది లబ్ధిదారులు వడ్డీతో కలిపి సుమారు రూ.1.02 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే, కొంతమంది సభ్యులకు మాత్రమే రుణాలు అందించి, అర్హత ఉన్న ఇతర సభ్యులకు రుణాలు మంజూరు కాలేదనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతమందికి రుణాలు మంజూరయ్యాయి, ఎంతమందికి వాస్తవంగా నిధులు అందాయి, ఒక్కో లబ్ధిదారుడికి ఎంత మొత్తం విడుదల చేశారు, NCDC సబ్సిడీ కింద ఎంత నిధులు మంజూరయ్యాయి, లబ్ధిదారులకు వాస్తవంగా ఎంత మొత్తం చేరిందనే వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
లబ్ధిదారులకు అందాల్సిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: