Tv424x7
National

రాజకీయాలు కాదు… సత్వర శిక్షలు కావాలి! : జస్టిస్. మదన్ బి లోకూర్

కోల్‌కతాలో యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్య యావద్దేశాన్ని దిగ్భ్రాంతపరిచాయి. తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలపై వేగంగా విచారణ చేపట్టి, దోషులకు కఠిన శిక్షలు విధించడం అత్యవసరం. సత్వర చర్యలు తీసుకుంటేనే బాధితులకు సరైన న్యాయం జరుగుతుంది.మహిళలపై హత్యాచారాల వంటి దురంతాలు జరిగినప్పుడల్లా వాటిని ముక్తకంఠంతో ఖండించడం, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేయడం షరా మామూలే. ఆపైన నాయకులు ఆర్భాటంగా మహిళా భద్రత కోసం ఏదైనా పథకాన్ని ప్రకటించి సరిపెట్టేస్తారు. బయట మాత్రం పరిస్థితి ఏమీ మారదు. మహిళలను ఆకతాయిలు వెంటాడి వేధిస్తూనే ఉంటారు. నగరాల్లోని సీసీటీవీలలో తరచూ ఇలాంటి దృశ్యాలు రికార్డు అవుతుంటాయి. జనం వాటిని చోద్యంగా, వినోదంగా చూస్తారు. తరవాత మరచిపోతారు. మహిళలపై గృహహింస వీధుల్లో హింసగా మారుతోంది. బాలికలు, యువతులు వద్దన్నా వెంటపడే ఆకతాయిలు తమ బుద్ధి మార్చుకోరు. కొందరు దుండగులైతే తమను కాదన్న మహిళలను హతమార్చడం జరుగుతూనే ఉంది. తనతో స్నేహం చేయడానికి నిరాకరించిందనే కోపంతో కొన్ని వారాల క్రితం ఒక దుండగుడు 15 ఏళ్ల బాలికను రైలు ముందుకు తోసి చంపిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఫేస్‌బుక్‌ స్నేహాన్ని వద్దన్నందుకు ఈ ఏడాది జూన్‌లో మధురలో ఓ టీనేజీ అమ్మాయిని చంపిన ఘటన వార్తలకెక్కింది. దేశంలో ఇలాంటివి చాలానే జరుగుతున్నా వెలుగులోకి వస్తున్నవి కొన్నే. కోల్‌కతాలో వైద్యురాలి హత్య కానివ్వండి, మధుర, రాజస్థాన్‌లలో టీనేజ్‌ బాలికల హత్యలు కానివ్వండి- ఒక మనిషి ప్రాణాలు తీయడమనేది చాలా దారుణం. ఇక చిన్నారులపై అత్యాచారం, హత్య అనేవి సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే కిరాతకాలు. మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులమీద ఓ స్కూలు అటెండర్‌ అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ బాలికల్లో ఒకరి వయసు మూడేళ్లైతే రెండో బాలిక వయసు నాలుగేళ్లు. ఈ పాశవిక చర్యపై వేలమంది ప్రజలు వీధులకెక్కి నిరసన తెలిపారు. పాఠశాల యాజమాన్యపు బాధ్యతారాహిత్యాన్నీ, పోలీసుల నిష్క్రియాపరత్వాన్నీ ఖండించారు.పిల్లలపై అకృత్యాలుబాలలు చేసే నేరాలకు దక్కినంత ప్రచారం బాలలపై జరిగే నేరాలకు లభించడం లేదు. ఉదయ్‌పూర్‌లో పదో తరగతి విద్యార్థి పాత తగాదా వల్ల తన సహాధ్యాయిని హత్య చేసిన ఘటన అందరికీ విభ్రాంతి కలిగించింది. అదేసమయంలో పిల్లలపై పెద్దలు చేసే దారుణాలు పెరిగిపోవడం చూస్తుంటే మన సమాజం ఎటు పోతోందనే అనుమానం కలుగుతోంది. 2022లో నేరాలకు సంబంధించి జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) ప్రచురించిన వివరాలను చూస్తే పిల్లలపై రెండు రకాల నేరాలు జరుగుతున్నట్లు అవగతమవుతోంది. బాలల అపహరణ, అక్రమ రవాణా, హత్యలు ఒక రకం. 2022లో ఇలాంటి కేసులు 1,62,449 నమోదయ్యాయి. 2021లో నమోదైన కేసులకన్నా ఇవి 8.7శాతం ఎక్కువ. లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే చట్టం (పోక్సో) కింద శిక్షార్హమైన నేరాలు రెండో కోవకు చెందుతాయి. 2022లో బాలికలపై లైంగిక దాడి కేసులు 63వేలకు పైగా నమోదయ్యాయి. అంటే దేశంలో ప్రతి 10 నిమిషాలకు ఒక బాలికపై అత్యాచారం జరిగిందన్నమాట. ఇక్కడ టీనేజీ వయస్కులు ఇష్టపూర్వకంగా ఇంటి నుంచి పరారైన ఘటనలను కూడా లైంగిక దాడి కేసులుగానే పరిగణిస్తున్నారని గమనించాలి. పైన చెప్పుకొన్న నేరాల్లో వీటిని కూడా జమచేశారు. పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేసినా, వాటిపై అపరిష్కృత కేసుల భారం కొండలా పెరిగిపోయింది. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం ఇలాంటి పెండింగు కేసుల సంఖ్య మూడు లక్షలు. ఇవన్నీ ఎప్పుడు పరిష్కారమై నేరస్థులకు శిక్షలు పడతాయి… బాధితుల కుటుంబాలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందనే ప్రశ్నలు అందర్నీ వేధిస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం- అత్యాచార బాధితురాలి మనసుకు అయిన గాయం మాత్రం ఎన్నటికీ మానదు. అంటే ఆమెకు జీవితాంతం న్యాయం జరగదన్నమాట. ఇకపై మహిళా భద్రత గురించి మాట్లాడేటప్పుడు బాలబాలికలపై జరుగుతున్న అత్యాచారాలను కూడా చర్చించాలి. నేరస్థులకు శిక్షలు పడి తీరాలి. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.పరిష్కార మార్గాలిలా…పిల్లలపై లైంగిక అత్యాచారాలు మినహా ఇతర రకాల నేరాలను తీవ్రమైనవిగా చాలామంది పరిగణించడం లేదు. చిన్నారులను అపహరించుకుపోయి వారిని విడుదల చేయడానికి డబ్బులు డిమాండ్‌ చేయడం, హింసించడం, హతమార్చడం కూడా హేయమైన నేరాలే. ఆడ శిశువులను గర్భంలోనే అంతమొందించడం ఇంకా క్రూరమైన నేరం. ఇలాంటి వాటికి శిక్షలు పడేలా జాగ్రత్త తీసుకోవాలి. శుష్క ప్రసంగాలు, పథకాలతో పనికాదని గ్రహించాలి. పిల్లలు, మహిళలపై నేరాలకు వెంటనే శిక్షలు పడటం లేదు. ప్రత్యేక కోర్టులు కూడా ఈ విషయంలో విఫలమయ్యాయి. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల సంగతీ అంతే! బాలలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు వంటి కేసులను నిర్ణీత కాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. స్త్రీని తల్లిగా, చెల్లిగా, కూతురిగా కీర్తించడంతో సరిపెట్టకుండా బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలి. నేటి బాలలే రేపటి ఆశాజ్యోతులంటూ ఊదరగొట్టడం కన్నా వారి భద్రతకు సకల జాగ్రత్తలూ తీసుకోవడం చాలా ముఖ్యం. భయాందోళనలు లేని వాతావరణంలో వారు పెరిగేలా చూడటం జాతి బాధ్యతే. అన్నింటినీ మించి స్త్రీలు, పిల్లలపై జరిగే నేరాల గురించిన చర్చల్లో రాజకీయాలు చొరబడకుండా చూడాలి. హేయమైన నేరం హేయమైనదే అవుతుంది తప్ప రాజకీయ జోక్యంతో దాని తీవ్రత తగ్గిపోదు. చిన్న పిల్లలపై నేరం జరిగితే వెంటనే శిక్షించాల్సింది పోయి ఆ ఉదంతాన్ని రాజకీయం చేయడమెందుకు? రాజకీయ పార్టీలు ఇలాంటి నేరాలను నివారించడంపై దృష్టి పెట్టాల్సింది పోయి, ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం క్షంతవ్యం కాదు. బాలలు, స్త్రీలపై నేరాలు జరిగినప్పుడు సమర్థంగా దర్యాప్తు జరిపి నేరస్థులను శిక్షించడానికి తగిన యంత్రాంగాలను సిద్ధం చేసుకోవడం సమాజం మీదున్న బాధ్యత!

Related posts

‘ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం’ స్ఫూర్తితో మహా కుంభమేళా

TV4-24X7 News

వాట్సప్ లో కొత్తగా మూడు ఫీచర్లు

TV4-24X7 News

మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం మృతి

TV4-24X7 News

Leave a Comment