నగర జీవనశైలిలో పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రకృతి వైద్యం కొత్త ఆశగా మారుతోంది. బల్కంపేటలోని కొణిజేటి రోశయ్య ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయంలో రోజూ వందలాది మంది రోగులు సహజ వైద్య పద్ధతులతో చికిత్స పొందుతున్నారు.
ఈ చికిత్స కేంద్రం ప్రత్యేకత ఏమిటంటే – రోగులు ఇక్కడకు వస్తే ప్రకృతితో మమేకమై ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్తారని వైద్యులు చెబుతున్నారు. మట్టి, జల మర్దన, సూర్యకిరణ చికిత్స, యోగా, ప్రాణాయామం, ఆక్యుపంచర్ వంటి సహజ పద్ధతులతో మధుమేహం, చర్మవ్యాధులు, జీర్ణకోశ సమస్యలు, ఒత్తిడి, కీళ్ల నొప్పులు, నిద్రలేమి, థైరాయిడ్ వంటి వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు.
కేంద్రంలో ఓపెన్ జిమ్, 8 పాత్వే నడక దారి, కిచెన్ గార్డెన్, మూలికల వనం, అత్యాధునిక భోజనశాల సౌకర్యాలు ఉన్నాయి. రోగులకు వ్యక్తిగత, షేరింగ్ కాటేజీల వసతి కల్పిస్తున్నారు. యోగా, ధ్యాన సాధనలతో పాటు గర్భిణులకు సాధారణ ప్రసవానికి అవసరమైన ప్రత్యేక సాధనలు కూడా నేర్పిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి రాయితీ సదుపాయం అందుబాటులో ఉంది.
ఇక్కడే ప్రకృతి గాంధీ వైద్య కళాశాల, వేమన యోగా పరిశోధనా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి.
వైద్యులు చెబుతున్నట్లుగా, ప్రకృతి వైద్యం కేవలం చికిత్స పద్ధతి మాత్రమే కాదు, జీవనశైలి. “మట్టి, నీరు, గాలి, ఎండ వంటి సహజ వనరులతో శరీరంలోని ప్రాణశక్తిని ఉత్తేజితం చేసి, రోగాలను మూలం నుంచి తొలగించడమే దీని ప్రత్యేకత” అని వైద్యులు వెల్లడిస్తున్నారు.

