నంద్యాల : పరిశ్రమలు మరియు ఫ్యాక్టరీల్లో పని గంటలను 8 నుంచి 13 గంటలకు పెంచుతూ ఇటీవల అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నంద్యాల గాంధీ చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఐటీయూ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నరసింహ నాయక్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి కె. మహమ్మద్ గౌస్, నాయకులు సుబ్బారావు, జైలాన్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 50 మంది కార్యకర్తలు ఈ నిరసనలో భాగమయ్యారు.తరువాత సమావేశంలో మాట్లాడుతూ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షులు తోట మద్దులు, మహమ్మద్ గౌస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసింహ నాయక్, రైతు సంఘం సహాయ కార్యదర్శి రామచంద్రుడు మాట్లాడుతూ —“బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను లేబర్ కోడ్ పేరుతో రద్దు చేసింది. ఆ కోడ్ల అమలు క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పని గంటలను పెంచి యాజమాన్యాలకు లాభం చేకూర్చే చర్యలు తీసుకుంటోంది” అని విమర్శించారు.కార్మికులపై భారాన్ని పెంచే ఈ బిల్లును వెంటనే ఉపసంహరించాలని, ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ‘8 గంటల పని – 8 గంటల కుటుంబం – 8 గంటల విశ్రాంతి’ విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.– సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం కమిటీలు, నంద్యాల.

